కేంద్రం కీలక నిర్ణయం..

నవతెలంగాణ – ఢీల్లి: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. సదరు పబ్లిషర్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేధించిన 2004నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం.. ఓటీటీ మాధ్యమాల్లో ప్రదర్శించే వెబ్‌ సిరీసులు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల్లో పొగాకు వినియోగానికి సంబంధించిన దృశ్యాలుంటే ఇకపై హెచ్చరికలు జారీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ‘పొగాకు వినియోగం క్యాన్సర్‌ కారకం, పొగాకు వినియోగం ప్రాణాంతకం’ అని సినిమా థియేటర్లు, టీవీల్లో ప్రదర్శించినట్లుగానే ఓటీటీల్లోనూ కార్యక్రమం ప్రారంభానికి ముందు, మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా ప్రకటనను ప్రదర్శించాలని తెలిపింది. దీంతోపాటు పొగాకు ఉత్పత్తులను వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లెయిమర్‌ను చూపించాలని పేర్కొంది. ఈ సందేశం కూడా నిబంధనలకు అనుగుణంగా.. తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగులో ఉండాలని పేర్కొంది. అంతేగాక, ఈ హెచ్చరికల ప్రకటనలు ఓటీటీ కంటెంట్‌ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని స్పష్టం చేసింది.

Spread the love