భారీ వర్షాలు..తెలంగాణలో సెలవులు పోడిగింపు..!?

నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో నేడు, రేపు (సోమ, మంగళ) ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెలవుల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు.. తెలంగాణ సీఎంవో, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి , హరీష్ రావులను ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు ట్వీట్లు  చేస్తున్నారు. అయితే.. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మూడ్రోజులు గురు, శుక్ర, శనివారాలు వరుసగా సెలవులు ఇవ్వగా.. ఇప్పుడు మళ్లీ సెలవులు పొడిగించాలా..? వద్దా..? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కాసింత వర్షం తగ్గింది కానీ.. వరద మాత్రం అలానే ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, రోడ్ల మీదనే చెట్లు కూలిపోవడం, కొన్ని గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్కూళ్లకు వెళ్లడానికి విద్యార్థులు ఇంకెంత ఇబ్బంది పడతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. నేడు (సోమవారం) స్కూల్స్ ఉన్నా మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించాలని.. ఆ రెండ్రోజులు భారీగా వర్షాలు ఉండే చాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఈ డిమాండ్లు వినడం, సోషల్ మీడియాలో చూశాక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.