ప్రకృతి పునర్జీవనం దిశగా తెలంగాణం

– హరితహారంతో పెరిగిన పచ్చదనం
– ఇప్పటిదాకా నాటిన మొక్కలు 273.33 కోట్లు
– పదేండ్లలో గ్రేటర్‌లో 147 శాతం పెరిగిన గ్రీన్‌కవరేజీ
– రాష్ట్రంలో 7.70 శాతం పెరిగిన పచ్చదనం
– దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ హరితోత్సవం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక అస్థిత్వం కోసం ఆరాటపడిన తెలంగాణ, రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు నేతృత్వంలో ప్రకృతి పునర్జీవనం దిశగా రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఆయన ఆలోచనల్లోంచి పుట్టిందే తెలంగాణకు హరితహారం పథకం మంచి ఫలితాలను సాధిస్తున్నది. రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నది. ఆ పథకం కింద ఇప్పటిదాకా రాష్ట్రంలో 273.33 కోట్ల మొక్కలు నాటారు. దీని ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.70 శాతం పెరిగింది. పదేండ్లలో గ్రేటర్‌లో గ్రీన్‌ కవరేజీ 147 శాతానికి చేరుకున్నది. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హరితోత్సవాన్ని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ తెలంగాణ హరిత ప్రగతి రిపోర్టును విడుదల చేసింది.
అందులోని ముఖ్యాంశాలు ఇలా…
రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్చమైన గాలిని, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది. ఇలా ఆలోచించటంతో పాటు, ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికీ, సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇలా రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లివిరియాలంటే తెలంగాణకు హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి.
హరితహారం ఫలితాలు (2015-23)
ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా నాటిన మొక్కలు 273.33 కోట్లు.
14, 864 నర్సరీల ఏర్పాటు.
హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10,822 కోట్ల వ్యయం.
13,657 ఎకరాల్లో 19, 472 పల్లె ప్రకృతి వనాలు, 6,298 ఎకరాల్లో 2011 బృహత్‌ ప్రకృతి వనాల ఏర్పాటు
రాష్ట్రమంతా 1,00, 691 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌. అందులో 12,000 కిలో మీటర్లు బహుళ రహదారి వనాలు.
పర్యావరణంపై పిల్లలకు అవగాహన పెంచేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ‘వనదర్శిని’ కార్యక్రమం చేపట్టారు.
సాధించిన విజయాలు ఇలా…
13.44 లక్షల ఎకరాల అటవీ పునరుద్దరణ. 2.03 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్‌ పూర్తి.
పునరుద్దరణ ద్వారా పెరిగిన మొక్కలు 53.84 కోట్లు.
– 10,886 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతాల చుట్టూ కందకాల తవ్వకం.
అగ్ని ప్రమాదాల నివారణ కోసం 21,452 కిలోమీటర్ల మేర ఫైర్‌ లైన్లు ఏర్పాటు.
నేల, తేమ పరిరక్షణ కోసం అడవుల్లో పెద్ద ఎత్తున నీటి యాజమాన్య పద్ధతుల అమలు. చెక్‌ డ్యాములు, ఇంకుడు చెరువులు/ కుంటలు మొదలైనవాటి నిర్మాణం.
పట్టణ ప్రాంత అటవీ ఉద్యానవనాలు
రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు సమీపంలో 75,740 ఎకరాల్లో 109 అర్బన్‌ ఫారెస్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. 164 హరిత వనాల్లో వంద శాతం పచ్చదనం సాధించేందుకు 1.71 లక్షల ఎకరాల్లో 1.06 కోట్ల మొక్కలను నాటించింది.
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో…
గ్రేటర్‌లో సుమారు ఏడు కోట్ల మొక్కలు నాటడంతో పాటు, కొత్తగా 456 కాలనీ పార్కులను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేసింది. 1120 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్‌, 115 చోట్ల యాదాద్రి మోడల్‌లో (మియావాకి) పచ్చదనం పెంపునకు కృషి చేసింది. గ్రేటర్‌ పరిధిలో పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కింద పచ్చదనం పెంపు కోసం సుమారు రూ.700 కోట్లను కేటాయించింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం హరితహారం వల్ల గ్రేటర్‌ పరిధిలో పదేండ్లలో గ్రీన్‌ కవర్‌ భారీగా 147 శాతం పెరిగింది. 11.93 కోట్ల మొక్కలను నాటారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇంటర్‌ ఛేంజ్‌లు, సర్వీస్‌ రోడ్లు, పార్కులు పచ్చదనంతో హైదరాబాద్‌కు మణిహారంగా మారాయి. హైదరాబాద్‌ చుట్టూ 16 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అభివృద్ధి చేసింది. హెచ్‌ఎమ్‌డీఏ కృషి వల్ల గ్రీన్‌ సిటీ ఆఫ్‌ వరల్డ్‌గానూ మన్ననలు అందుకుంటున్నది.
విజయవంతమైన సంస్థగా ఫారెస్ట్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌
అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ప్లాంటేషన్‌ చేసే సంస్థగా ఫారెస్ట్‌ స్టీవార్డ్‌ షిప్‌ కౌన్సిల్‌ (జర్మనీ) సర్టిఫికేషన్‌ను ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌గా పేరు పొందింది. ఇలా దేశంలో గుర్తింపు పొందింది ఇది ఒక్కటే.
సంప్రదాయ యూకలిప్టస్‌ స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలు(టేకు, రోజ్‌వుడ్‌, గంధం, ఎర్రచందనం, సీతాఫల్‌, సరుగుడు) మొక్కల పెంపకంపై కార్పొరేషన్‌ దృష్టి సారించింది. ఎనిమిదేండ్లుగా సగటున 82. 69 కోట్ల రూపాయల రాబడి, గత ఆర్థిక సంవత్సరం (2022-23) 150 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఈ యేడాది అంచనా 200 కోట్ల రూపాయలు. ఎఫ్‌డీసీ నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయి ఎకో పార్కులుగా బొటానికల్‌ గార్డెన్‌, పాలపిట్ట సైక్లింగ్‌ పార్క్‌, ఫారెస్ట్‌ ట్రెక్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అభివృద్ధి చేసింది.
ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా- స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్టు ప్రకారం హరితహారానికి అవార్డులిలా..
2015-21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్‌ కవర్‌ 6.85 శాతం పెరిగింది. ఇది 3.36 లక్షల ఎకరాలకు సమానం.
రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్‌ కవర్‌) 7.70 శాతం పెరిగింది. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం.
ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌ -2020-21గా హైదరాబాద్‌కు గుర్తింపు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, ఆర్బర్‌ డే ఫౌండేషన్‌ ద్వారా అవార్డు.
నీతి అయోగ్‌ సమీకృత అభివృద్ధి లక్ష్యాల సూచీల్లో (2020- 21) అటవీకరణ విభాగంలో తొలిస్థానం తెలంగాణదే.
ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ ప్రొడ్యూసర్స్‌, సౌత్‌ కొరియా ద్వారా వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డ్‌ -2022 దక్కించుకున్న హైదరాబాద్‌.
వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ దేశవ్యాప్తంగా నగరాల్లో నిర్వహించిన సిటీ నేచర్‌ ఛాలెంచ్‌ – 2023లో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాద్‌. అత్యధిక జీవవైవిధ్యం గల నగరంగా గుర్తింపు.
– సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ సంస్థ నివేదిక ప్రకారం పచ్చదనం పెంపులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది.

Spread the love