నవతెలంగాణ – ఒంగోలు
గిరిజన యువకుడితో కొందరు పూటుగా మద్యం తాగించారు. ఆ తర్వాత విచక్షణారహితంగా చావబాదారు. తీవ్రంగా రక్తం కారుతు గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కనీసం కనికరం చూపించలేదు. అయిన కూడా వారిలోని పైశాచికత్వం అంతటితో ఆగలేదు. అతని నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చితకబాదారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడి వేడుకున్నాడు. మూత్రం పోసిన బూతులు తిడుతూ వ్యక్తి మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలంటూ కొట్టారు. ఈ దారుణాన్ని ఫోన్ లో వీడియోలు తీశారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సుమారు నెల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బాధితుడు మోటా నవీన్ గిరిజన యువకుడు. ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు (అంజి). వీరిద్దరూ చిన్నప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరిపై సుమారు 50కి పైగా గృహ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. నవీన్ అనేక సార్లు పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష కూడా అనుభవించాడు. అంజి కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం అంజి.. నవీన్ ను మద్యం తాగుదామంటూ ఒంగోలులోని కిమ్స్ వైద్యశాల వెనుక వైపునకు పిలిచాడు. నవీన్ అక్కడికి వెళ్లేసరికి అక్కడ అంజితోపాటు ఒంగోలులోని ఇస్లాంపేట, గోపాలనగర్, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన మొత్తం 9 మంది యువకులు ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో అంజి పాత వివాదాన్ని తిరగదోడటంతో మాటామాటా పెరిగింది. అప్పటికే ఒక పథకం ప్రకారం అక్కడున్న తొమ్మిది మందీ కలసి నవీన్ పై ఒకసారిగా దాడి చేశారు.
తనను వదిలిపెట్టాలని బాధితుడు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. విచక్షణారహితంగా దాడి చేసి రక్తమోడేలా కొట్టారు. అంతటితో ఆగకుండా అతడి నోట్లో మూత్రం పోస్తూ తాగాలని బలవంతం చేస్తూ మరోసారి దాడి చేశారు. మర్మాంగాన్ని అతని నోట్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. ఈ దారుణాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియోలు వెలుగుచూశాయి.
కేసు పెట్టి.. చేతులు దులిపేసుకున్నారు
నెల రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై బాధితుడు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేవలం దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. నిందితులు విచారణ, అరెస్టుకు సైతం ప్రయత్నించలేదు. తాజాగా నిందితుల్లో కొందరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది వైరల్ గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఈ ఘటనలో పాలుపంచుకున్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.