అఖిల్‌ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్‌

అల్లు అరవింద్‌ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాత. ‘భలే భలే మగాడివోరు, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, 18 పేజెస్‌’ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రంలో కశ్మీర హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నుండి రిలీజైన సాంగ్స్‌, టీజర్‌ అన్ని మంచి అంచనాలను క్రియేట్‌ చేశాయి. అలానే రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్‌ నైబరింగ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బందం మంగళవారం ప్రెస్‌మీట్‌లో చిత్రానికి సంబంధించి పలు విశేషాలను షేర్‌ చేసింది. ఇందులో భాగంగా సినిమా చాలా బాగా వచ్చిందని, ఈ సినిమాలో ప్రేమ, కామెడీ , థ్రిల్లింగ్‌ .. ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయని పేర్కొంది. అలాగే కేవలం ఒక సెక్షన్‌ ఆడియన్స్‌ని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈనెల 16న నిర్వహించబోతున్నామని, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అక్కినేని అఖిల్‌ హాజరు కాబోతున్నట్లు ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ తెలియజేసింది. ‘ఓ మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మా బ్యానర్‌లో రాబోతున్న మరో సూపర్‌హిట్‌ సినిమా అనే నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాత బన్నీవాసు తెలిపారు.