కాపీ కొట్టారంటే ఎలా?

‘బలగం’ సినిమా కథ నాదంటూ జర్నలిస్ట్‌ గడ్డం సతీష్‌ మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ,’కాకులు ముట్టటం అనేది నేనేమీ కొత్తగా చెప్పలేదు. నిజం చెప్పాలంటే బలగం సినిమా కథ కాదు.. మన తెలుగు వారి జీవితాల్లో జరిగే మూమెంట్స్‌. మన జీవితాల్లో జరిగే ఘటనలే ఇవి. నేను సతీష్‌ రాసిన ‘పచ్చికి’ కథ చదివాను. ఆయన కథలో పర్యావరణం అనే పాయింట్‌ను టచ్‌ చేశారు. దానికి, మా సినిమాకి సంబంధం లేదు. ఇది తెలంగాణ సాంప్రదాయం. ఇది చరిత్ర మనకు ఇచ్చింది. ఎవరి సొత్తు కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవం ఉంటుంది. అలాంటి వాటిని ఇది నాదని అంటే ఎలా?, చావులపై భారతీయ సినిమాల్లో చాలా సినిమాలు వచ్చాయి. కాపీ కొట్టారంటే ఎలా?, నా సినిమా కథను, సతీష్‌ రాసిన కథను చదివి మాట్లాడండి. రైటర్‌ అసోసియేషన్‌కి వెళ్లి చర్చించండి. ఈ రెండింటిని చూసి, నాది తప్పు ఉందని వాళ్లు చెబితే, దానికి వాళ్ళు ఏం చెబితే అది చేస్తాను. అంతేతప్ప చిల్లర పబ్లిసిటీ కోసం ఇలా చేయటం కరెక్ట్‌ కాదు. ఈ కథ రాసింది నేను. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడండి. నిర్మాత దిల్‌ రాజుని అబాసు పాలు చేయవద్దు. రైటర్స్‌ అసోసియేషన్‌ నాకు తప్పకుండా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.