చేనేతకు చేయూత ఏది?

– బడ్జెట్‌లో పెరగని నిధులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూత ఇవ్వలేదు. వారి అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటనలిస్తున్నది. కానీ బడ్టెట్‌లో మాత్రం గతేడాది కేటాయించిన నిధులనే.. ఈ ఏడాది బడ్టెట్‌లో చూపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీ మోపి, నడ్డివిరిచింది. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం… బడ్జెట్‌లో నిధులను పెంచలేదు. గతేడాది చేనేతకు రూ.455 కేటాయించిన ప్రభుత్వం…ఈసారి కూడా అదే అంకెలను పొందుపరిచింది. బతుకుమ్మ చీరెల కోసం కూడా గతేడాది కేటాయించిన రూ 400 కోట్లను మరోసారి చూపింది. పవర్‌లూమ్‌ ప్రమోషన్‌ చేయాలనే లక్ష్యాన్ని కూడా నిధులను తగ్గించింది.
చేనేత వస్త్రాలు వారంలో ఒక రోజు ధరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. చేనేత వస్త్రాలను విరివిగా ఉపయోగించేలా ఆ కార్మికులకు సబ్సిడీలు ఇచ్చే వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోలేదు. అందుకు సరిపడిన నిధులను కేటాయించకపోవడంతో ఆ రంగం మరింత కుదేలు అయ్యే పరిస్థితి ఉన్నది. చేనేతకు బడ్జెట్‌లో కొత్తగా ఏమీ ఇవ్వలేదని డాక్టర్‌ దొంతి నర్సింహరెడ్డి తెలిపారు. గతంలో ప్రవేశ పెట్టిన పథకాలనే తిరిగి పెట్టారని చెప్పారు. చేనేత కార్మికుల కుటుంబాల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని కోరారు.