‘మధుర గతమా..కాలాన్నే ఆపకా..ఆగావే సాగకా అంగుళికమా..జాలైనా చూపకా చేజారావే వంచికా..’అని దుష్యంతుడికి దూరమైన శకుంతల మనసులోని బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తుంది. దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు, గంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంది శకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మరచిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయురాలైన ఆమె ఏం చేస్తుంది?, శకుంతల మనసుకి తగిలిన గాయాన్ని కాలం ఎలా మాన్పించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘శాకుంతలం’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు దర్శక, నిర్మాత గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో త్రీడీ టెక్నాలజీతో విజువల్ వండర్గా రూపొందుతున్న పౌరాణిక ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించగా, శకుంతల పాత్రలో అగ్ర నాయిక సమంత ఒదిగిపోయింది. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాలం పరిగెడుతున్నా ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండేలా అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు, శకుంతల ప్రేమను కవి కాళిదాసు అద్భుతంగా వర్ణిస్తే, దాన్ని మించిపోయేలా అబ్బుర పరిచే సాంకేతిక విలువలతో.. ప్రతి ఫ్రేమ్ను కళ్లప్పగించి చూసేంత గొప్పగా తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్. ఆ విషయం ఇటీవల విడుదలైన పాటలు, టీజర్తో క్లియర్గా తెలిసింది. ఇటీవల ఈ విజువల్ వండర్ నుంచి ‘మధుర గతమా..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పాట వింటుంటే ఓ ఎమోషనల్ టచ్తో సాగుతూ భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని పాట తెలియజేసేలా ఉంది. మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలోని పాటను శ్రీమణి రాయగా, అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ పాడారు. ఈ చిత్రాన్ని విజువల్గానే కాకుండా మ్యూజికల్గానూ ఆడియెన్స్కు ఆమేజింగ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వటానికి రీ రికార్డింగ్ను బుడాపెస్ట్, హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ వర్క్ చేయటం విశేషం. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో డా.ఎం.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రలను పోషించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్ వైడ్గా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.