నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు

– బాండ్‌ పేపర్‌పై సంతకం చేయండి
– సోనమ్‌ వాంగ్‌చుక్‌కు లడఖ్‌ యంత్రాంగం హుకుం
– సంతకం చేయనన్న రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత వాంగ్‌చుక్‌
శ్రీనగర్‌ :
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే, పర్వతాలను పరిరక్షించాలనే డిమాండ్‌తో ఐదు రోజుల నిరాహార దీక్షను చేస్తున్న సామాజికవేత్త, విద్యా సంస్కర్త, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్‌ వాంగ్‌చుక్‌ను నియంత్రించడానికి అక్కడి యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఆయనతో బాండ్‌ పేపర్‌పై సంతకం చేయించాలని చూసింది. గత నెల రోజులుగా లేV్‌ా లో జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి ప్రకటనలూ చేయననీ, బహిరంగ సమావేశాల్లో పాల్గొనననీ హామీనిస్తూ బాండ్‌ పేపర్‌పై సంతకం చేయాల్సిందిగా యంత్రాంగం ఆయనకు తెలిపింది. ఈనెల 26 నుంచి వాంగ్‌చుక్‌ ఫియాంగ్‌లో ‘పర్యావరణ దీక్ష’ లో ఉన్నారు. అక్కడ మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అయితే, ఈ తరుణంలో లడఖ్‌ కేంద్రపాలిత యంత్రాంగం పైన తెలిపిన విధంగా అండర్‌టేకింగ్‌ను సమర్పించాల్సిందిగా ఆయనను కోరింది. దీనికి సంబంధించిన విషయాన్ని వాంగ్‌చుక్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. బాండ్‌కు సంబంధించిన పత్రాలను సైతం పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు, కార్యక్రమాలకు రెచ్చగొట్టవద్దనీ, అది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనీ, అనుమతినిచ్చిన ప్రాంతంలోనే వారు (వాంగ్‌చుక్‌) తన దీక్షను కొనసాగించాలని ఆ బాండ్‌ పేపర్‌లో ఉన్నది. దీనిని ఉల్లంఘిస్తే న్యాయపరమైన చర్యలుంటాయని యంత్రాంగం పేర్కొన్నది. ”వారు (యంత్రాంగం) నిన్న, ఈ రోజు నా వద్దకు వచ్చి బాండ్‌పై సంతకం చేయాలన్నారు. నేను మొదటగా నా లాయర్లను కలుస్తానని వారికి చెప్పాను” అని వాంగ్‌చుక్‌ చెప్పారు. తాను బాండ్‌పై సంతకం చేయనని కూడా తెలిపారు. గొంతులను నొక్కే ”బనానా రిపబ్లిక్‌” వ్యూహంగా దీనిని ఆయన అభివర్ణించారు. తన పర్యావరణ దీక్ష అనేది అసమ్మతి చర్య కాదనీ.. పర్యావరణానుకూల జీవనశైలిని ప్రోత్సహిస్తున్నా ననీ.. పర్వతాలు, హిమానీనదాల రక్షణను తాను కోరుతున్నానని వాంగ్‌చుక్‌ తెలిపారు. ఐదు రోజుల పర్యావరణ దీక్షను చేపట్టడానికి నిర్ణయించిన ఖర్డూంగ్‌ లా పాస్‌ ప్రాంతానికి వెళ్లకుండా నిరోధించడానికి తన ఉద్యమాన్ని పాలక యంత్రాంగం నియంత్రించిందని ఆయన అన్నారు. వారు తనకు వారంట్‌ జారీ చేయలేదనీ, గృహ నిర్బంధం కంటే దారుణమైన స్థితిలో తాను ఉన్నానని తెలిపారు. 2019, ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగా కాశ్మీర్‌ ప్రధానస్రవంతి రాజకీయ నాయకులను సంతకాలు చేయాలంటూ ఆదేశించిన బాండ్‌ పేపర్‌ లో ఉన్న పదాలే.. ప్రస్తుతం వాంగ్‌చుక్‌కు జారీ చేసిన బాండ్‌ పేపర్‌లో ఉండటం గమనార్హం. ఇటు లడఖ్‌లో భూమి, ఉద్యోగాల రక్షణపై చర్చించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ లో చర్చల్లో పాల్గొనడానికి ఈ ప్రాంతానికి చెందిన రెండు పెద్ద పౌర సంఘాల నిరాకరించాయి. ప్యానల్‌ అజెండాలో లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌ కింద రాజ్యాంగ పరిరక్షణలు వంటి తమ డిమాండ్లను చేర్చలేదని పౌర సంఘాలు తెలిపాయి.