ప్రాజెక్ట్‌ కె సంక్రాంతి కానుకగా రిలీజ్‌

ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలలో ఇదొకటి. పాన్‌ వరల్డ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా కోసం మేకర్స్‌ పర్ఫెక్ట్‌ రిలీజ్‌ డేట్‌ని ఖరారు చేశారు. జనవరి12, 2024న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ని పురస్కరించుకుని యుద్ధ సన్నివేశంతో విడుదల చేసిన అద్భుతమైన రిలీజ్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్నఉ కట్టిపడేసింది. ముగ్గురు వ్యక్తులు భారీ చేతికి తుపాకీని గురిపెట్టి చూస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో మైదానంలో ఆయుధాలతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రపంచం ఎదురుచూస్తోంది… అని పోస్టర్‌ పై రాసి ఉంది. ఇండియాలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచిన ఈ అద్భుతమైన సినిమా విడుదల కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందనే ఫీలింగ్‌ ఈ పోస్టర్‌ చూస్తే కలుగుతుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా మరో లెవల్‌లో ఉండనుంది. విజయవంతంగా 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌ నిర్మాణంలో ఈ గోల్డెన్‌ జూబ్లీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు నిర్మాత అశ్విని దత్‌. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.