మినీ మేడారం జాతరలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

– 10 లక్షల రూపాయల విలువ గల ఔషధాల సామగ్రి ఏర్పాటు
– 50 వేల మాస్కులు అందుబాటులో
నవతెలంగాణ- తాడ్వాయి
మినీ మేడారం జాతరకు తరలివచ్చే లక్షలాది భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించడానికి మేడారంలో టీటీడీ కల్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని ములుగు జిల్లా వైద్యాధికారి అల్లం అప్పయ్య పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు అధ్యక్షతన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ జాతర సందర్భంగా నేటి నుండి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అన్నారు. జనవరి 31 నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అవుట్ పేషంట్ (ఓపి) సేవలు ఉంటాయన్నారు. మినీ జాతర ఫిబ్రవరి 1 నుండి 5వ తారీఖు వరకు 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
10 లక్షల రూపాయల విలువ చేసే మందులు (ఔషధాలు), 50వేల మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. మినీ జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య శిబిరానికి చేరుకొని ఉచిత వైద్యం పొందాలని సూచించారు. మినీ జాతరలో భక్తులు హోటల్లోని, బయట రోడ్డుపై దొరికే ఆహార పదార్థాలను తినకూడదన్నారు. మాస్క్ నుంచి కరోనా నియమ నిబంధనలను పాటించాలన్నారు. వేడివేడి ఆహార పదార్థాలు, పరిశుభ్రమైన ఆహారం, శుద్ధి చేసిన త్రాగు నీరు వాడాలన్నారు. దగ్గు జలుబు లాంటి చిన్నచిన్న వ్యాధులకు జాగ్రత్త వహించాలని సూచించారు. ములుగు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారన్నారు.
ఐలాపూర్, కొండాయి, కన్నేపల్లి, దొడ్ల, మల్యాల పిల్ల జాతరలలో కూడా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనదేవతల ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, సిద్ధబోయిన సురేందర్, తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రణధీర్, డిపిఎమ్ఓ సంజీవరావు, హెచ్ వి లు సరస్వతి, లక్ష్మి, సూపర్వైజర్ ఖలీల్, ఏఎన్ఎంలు సునీత, మమత, రాజ్యలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు చేల తిరుపతయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.