విఠల్‌కు ఎన్టీఆర్‌ శ్రమశక్తి అవార్డు ప్రదానం గర్వకారణం

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
సంఘసంస్కర్త, భారతీయ జీవిత బీమా సంస్థలు చీఫ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అడ్వైజర్‌గా సేవలందిస్తున్న కౌటికె విఠల్‌కు ఎన్టీఆర్‌ శ్రమశక్తి అవార్డును ప్రదానం చేయడం గర్వకారణం అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు తెలిపారు. మంగళవారం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో కౌటికె విఠల్‌కు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్సీ దయానంద్‌, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్‌ బాబురావు, గ్లోబల్‌ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ కౌటికె విఠల్‌ తన 23వ ఏట జీవిత బీమా ఏజెన్సీలో వృత్తిని ప్రారంభించి దేశంలోనే మొదటి స్థానాన్ని సంపాదించడం ఎంతో గొప్ప విషయమన్నారు. బీమా రంగంలో దేశంలోని ఉన్న ఏజెంట్లకు సలహాలు, సూచనలు, వ్యాపార మెలకువలు నేర్పుతూ ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించారని కొనియా డారు. ఇటీవల కాలంలో శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ వారు నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయాతి ఉత్సవంలో ఆయనకు సిల్వర్‌ క్రౌన్‌ తో పాటు ఎన్టీఆర్‌ శ్రమశక్తి బిరుదును ప్రదానం చేయడం గర్వకారణం అన్నారు. అలాంటి వ్యక్తిని అభినందించుకోవడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభను మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 2002లో ప్రారంభించినట్టు తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మహాసభ 50 దేశాలలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఏడాది దుబాయిలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ పేరుతో భారీ సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాసభ ప్రధాన కార్యదర్శి రమణయ్య, కోశాధికారి రామారావు, ముఖ్య సలహాదా రులు చింతల శ్రీనివాస్‌, మహాసభ ప్రతినిధులు నరసింహ గుప్తా, మల్లికార్జున్‌ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.