శివరాత్రికి 2427 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ శైవ క్షేత్రాలకు యాత్రీకుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్టు టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17 నుండి 19వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్టు తెలిపారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి 578, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, ఆలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను నడుతున్నా మన్నారు. శ్రీశైలం యాత్రా స్థలానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయనీ, వీటిలో ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. అలాగే గ్రూపులుగా శైవక్షేత్రాలకు వెళ్లేవారి కోసం అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్‌ఆర్టీసీ కల్పిస్తున్నదనీ, ఈ సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు.