సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి

– మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌-2019 సవరించాలి
– కేరళ తరహా యాప్‌ను ప్రభుత్వం తేవాలి
– రవాణారంగ కార్మికుల డిమాండ్‌
– రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

నవతెలంగాణ- విలేకరులు
”రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేయాలి.. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌-2019ను సవరించడంతోపాటు కేరళ తరహాలో యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తేవాలి” అని కార్మికులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ పబ్లిక్‌ అండ్‌ ప్రయివేటు ట్రాన్స్‌ఫోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా  ధర్నా చేశారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఈనెల 7న చలో ఇందిరాపార్కు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్‌ అండ్‌ ప్రయివేటు ట్రాన్స్‌ఫోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్‌ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి, జాయింట్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.  మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం ఏఓకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పున్నం రవి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తెలంగాణలోని రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏవో నారాయణకు వినతిపత్రం అందజేశారు.