సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు

– ఢిల్లీ మధ్యంకుంభకోణం కేసు…
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్‌ సిసోడియాకు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) శనివారం మళ్లీ సమన్లు జారీ చేసింది. సీబీఐ సమన్లు జారీ చేసిన విషయాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా శనివారం ట్వీట్‌ చేశారు. ఫిబ్రవరి 19న సీబీఐ ప్రధాన కార్యాలయానికి తనను పిలిపించిందని, విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తున్నానని, అలాగే కొనసాగుతానని మనీష్‌ సిసోడియా ట్వీట్‌ చేశారు. మనీష్‌ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన తాజా సాక్ష్యాధారాల ఆధారంగా ఆదివారం విచారణకు పిలిచామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవినీతికి సంబంధించి తాజా సమన్లను సీబీఐ జారీ చేసింది. ”ఆదివారం సీబీఐ నన్ను మళ్లీ విచారణకు పిలిచింది. ఈడి, సీబీఐలు పూర్తి అధికారాన్ని నాపై ప్రయో గించారు. అధికారులు నా ఇంటిపై దాడులు చేశారు. నా బ్యాంకు లాకర్‌లో సోదాలు చేశారు. కానీ నాకు వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు” అని సిసోడియా ట్వీట్‌ లో పేర్కొన్నారు. సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది. గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినరు కుమార్‌ సక్సేనా సిఫారసు చేశారు. విచారణకు సిఫార్సు చేసిన తరువాత, ఢిల్లీ ప్రభుత్వం తన మద్యం పాలసీని ఉపసంహరించు కోవలసి వచ్చింది. దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కేసులో సిసోడియాతో పాటు ఇతర ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులుగా పేర్కొన్నారు.