ఇంటర్‌ పరీక్షకు 14,481 మంది గైర్హాజరు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ఇంగ్లీష్‌ పేపర్‌-2 పరీక్షను నిర్వహించామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 4,49,868 మంది దరఖాస్తు చేయగా, 4,35,387 (96.79 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 14,481 (3.21 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనగామలో ఇద్దరు, ఖమ్మంలో ఒకరు కలిపి ముగ్గురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులను నమోదు చేశామని తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్షకు సెట్‌ సీ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఇంటర్‌ బోర్డు నుంచి పరిశీలకులు వెళ్లి పరీక్షను పరిశీలించారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జరిగిందని తెలిపారు.