ధ్రువపత్రాల పరిశీలనకు 16,978 మంది

– ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో 87,371 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరానికిగాను 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో శనివారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. ఈ మేరకు ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటిరోజు ధ్రువపత్రాల పరిశీలనకు 16,978 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఈనెల 12 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. మూడో రోజు 8,349 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించారని తెలిపారు. ఇప్పటి వరకు 87,371 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించారని వివరించారు. ఈ నెల 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. సోమవారం నుంచి ఈనెల 15 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈ నెల 19న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. అభ్యర్థులు ఇతర వివరాల కోసం www.://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.