2.80 కోట్లతో వరద నీటి కాలువ పనులు

– వారంలో పనుల ప్రారంభం
– మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె.వి రమణాచారి
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్‌
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో 2.80 కోట్ల ప్రత్యేక నిధుల (స్పెషల్‌ డెవలప్మెంట్‌ ఫండ్‌) తో నల్లగొండ పట్టణంలోని ఆరవ వార్డులో వరదనీటి కాలువ పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు.సోమవారం ఆరో వార్డులో పర్యటించిన కమిషనర్‌ విలేకరులతో మాట్లాడారు. వార్డు అభివద్ధిలో భాగంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వరదనీటి కాలువ పనులను చేపిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతినగర్‌ నుండి అక్షయ గార్డెన్‌ అక్కడి నుండి కలెక్టరేట్‌ వద్ద గల హెలిపాడ్‌ ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్‌ వరకు కాల్వ నిర్మాణ పనులను జరుగుతాయని తెలిపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంట ఆరవ వార్డు కౌన్సిలర్‌ కరుణాకర్‌ రెడ్డి, డిఈ వెంకన్న, ఏఈ దిలీప్‌, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.