బంద్‌, సమ్మెలో 20 కోట్ల మంది

On strike 20 crore people– ఎస్‌కేఎం, కేంద్రకార్మికసంఘాల వెల్లడి
న్యూఢిల్లీ : జార్ఖండ్‌లోని రాంచీ నుంచి మహారాష్ట్రలోని ధూలే వరకు, ఒడిశాలోని రూర్కెలా నుంచి తమిళనాడులోని తూత్తుకుడి వరకు, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం), కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక చేపట్టిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెలు రోజువారీ జీవనంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపాయి. ప్రజలు, రైతులు, కార్మికులు దుకాణాలు, మండీలు, ఫ్యాక్టరీలను మూసివేశారు. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, హైవేలను దిగ్బంధించారు. స్వామినాథన్‌ కమిషన్‌ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కోసం, అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఒకేసారి రుణమాఫీ, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయటం, లఖింపూర్‌ ఖేరీ ఊచకోతలో తన కుమారుడు ఆశిష్‌ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి రక్షించిన అజరు మిశ్రాను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చింది. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేలా రూ.26 వేలను కార్మికులకు కనీస వేతనంగా నిర్ణయించాలని కేంద్ర కార్మిక సంఘాలు (సీటీయూ) ఇందులో పాల్గొన్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ, అసోం, హర్యానా, పంజాబ్‌, గుజరాత్‌లలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఎర్ర జెండాలతో కార్మికులు ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘ప్రయివేటీకరణ వద్దు’, ‘రైతులందరికీ ఎంఎస్‌పీ ఇవ్వండి’ అంటూ నినాదాలు చేశారు. ఫిబ్రవరి 16న పరీక్షల షెడ్యూల్‌ కారణంగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైతులు, కార్మికులు ఫిబ్రవరి 13న చట్ట ఉల్లంఘన కార్యక్రమాన్ని, గ్రామీణ బంద్‌ను పాటించారు. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అమర్జీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. 20 కోట్ల మంది ప్రజలు సామూహిక కార్యాచరణలో పాల్గొంటారని నాయకులు ఆశిస్తున్నా రనీ, భారత స్వతంత్రానంతర చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పారు.