తెలంగాణకు 20 పోలీసు మెడల్స్‌

– ఆరుగురికి గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్స్‌ పోలీసు మెడల్స్‌
– 12 మందికి మెరిటోరియల్‌ సర్వీస్‌ మెడల్స్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించిన పోలీస్‌ మెడల్స్‌లో తెలంగాణకు 20 పతకాలు వరించాయి. దేశ వ్యాప్తంగా పోలీస్‌, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌, కరెక్షనల్‌ సర్వీస్‌లకు చెందిన 1,132 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య/ సేవా పతకాలను ప్రకటించింది. ఇద్దరికి మరణాంతరం ప్రెసిడెంట్స్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (పీఎంజీ), 275 మందికి మెడల్స్‌ ఫర్‌ గ్యాలంట్రీ(జీఎం), 102 మందికి విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పతకాలు(పీఎస్‌ఎం), 753 మందికి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌(ఎంఎస్‌ఎం) పతకాలు ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖలో ఉత్తమ సేవలకు గాను ఆరుగురికి మెడల్స్‌ ఫర్‌ గ్యాలంట్రీ(జీఎం), ఇద్దరికి ప్రెసిడెంట్స్‌ మెడల్స్‌ ఫర్‌ డిస్ట్రిగ్విష్డడ్‌ సర్వీస్‌ (పీఎస్‌ఎం), మరో 12 మందికి మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ (ఎంఎస్‌ఎం) అవార్డులు దక్కాయి. వీరిలో దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌(ఏడీజీ), సౌమ్య మిశ్రా(ఏడీజీ)లకు పీఎస్‌ఎం పతకాలు వరించాయి. అలాగే గడ్డిపోగుల అంజయ్య(ఆర్‌ఎస్‌ఐ), జేసీ/పీసీలు వడిచర్ల శ్రీనివాస్‌, నలివేణి హరీష్‌, బి సునిల్‌ కుమార్‌, ఎండీ ఆయూబ్‌, పి సతీష్‌ లకు గ్యాలంట్రీ మెడల్స్‌ దక్కాయి.
ఆరుగురికి ఎంఎస్‌ఎం మెడల్స్‌…
జాకబ్‌ ప్రమీలా(డీఐజీ), ఎన్‌ వెంకటేశ్వర్లు(ఎస్పీ), డి చంద్రయ్య(ఏఎస్పీ), ఏసీపీలు పి నరేష్‌ రెడ్డి, ఎస్‌ మోహన్‌ కుమార్‌లు, ఎన్‌ త్రినాథ్‌(కమాండెంట్‌), కె వీరయ్య(8వ బెటాలియన్‌ ఏసీ), ఎస్సైలు బి జయచంద్ర, ఎం సురేందర్‌ రెడ్డిలు, ఏఆర్‌ ఎస్సైలు ఈ. వెంకట్‌ రెడ్డి, జీ యేసుపదంలు, హెడ్‌ కానిస్టేబుల్‌ జంగయ్యలకు మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు దక్కాయి. అలాగే.. ఏపీకి మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ (ఎంఎస్‌ఎం) లో తొమ్మది మెడల్స్‌ దక్కాయి.