నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
క్రమశిక్షణ, అంకితభావంతో విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఆలం అన్నారు. సోమవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 9 నెలల పాటు కటోర పోలీసు శిక్షణను తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన 218 పోలీసు సివిల్, ఏఆర్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు సిబ్బందికి పోలీసు వ్యవస్థ పై, పోలీసు విధులపై నిజ జీవితంలో చేయవలసిన పనులపై ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ సమాజంలో బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో చేయవలసిన విధులపై కనీస అవగాహనను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు విచ్చేసిన సివిల్ 94 మెన్ కానిస్టేబుల్ లకు 46 విమెన్ కానిస్టేబుల్ లకు జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో పోస్టింగ్స్ ను కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ సెంటర్, సాంకేతికతను వినియోగించుకుని సిబ్బంది, రైటర్స్, జనరల్ డ్యూటీ, కోర్టు డ్యూటీ లాంటి విధులు ఉంటాయని వాటిపై ప్రతి ఒకరు రానున్న రోజుల్లో పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో నేర నియంత్రణ నేర పరిశోధన అలాంటి అంశాలు ముఖ్య పాత్రను పోషిస్తాయని తెలిపారు. నేను నియంత్రణలో పెట్రోలింగ్, వెహికల్ చెకింగ్, బీట్లు, పికెట్లను ఏర్పాటు చేయడం లాంటి అంశాలు వస్తాయని, అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ కనుగొనడం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, మొబైల్ నెట్వర్క్ పరిశోధన, అలాంటివి ఉపయోగించబడతాయని తెలిపారు.
