నవతెలంగాణ – సిరిసిల్ల
నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పీ అఖిల్ మహాజన్ సభ్యులు అదనపు ఎస్పీ చంద్రయ్య లు పాల్గొన్నారు. సిరిసిల్లలోని రగుడు డంప్ యార్డు సమీపంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసులలో స్వాదీనపరచుకున్న 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు.జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగులబెట్టుట జరుగుతుందని తెలియజేసారు.గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య,డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ యాదగిరి, టౌన్ సి.ఐ రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు.