– వాటిలోనూ మహిళలకు ఫ్రీ…
– 626 సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్
– అదనపు చార్జీల్లేవ్ : టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సుల్ని నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. వీటిలో 626 సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈనెల 7 నుంచి 15వ తేది వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శుక్రవారం హైదరాబాద్లోని బస్భవన్లో ఈ ఏర్పాట్లపై సంస్థ ఉన్నతాధికారులు, రీజినల్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా లక్ష్మి స్కీం అమలు నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎమ్జీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణీకుల సౌకర్యార్థం, షామియానా లు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను ఇంచార్జిలుగా నియ మించామనీ, రద్దీకి అనుగుణంగా వారు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతారని వివరించా రు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు, షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి పండుగకు ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి చార్జీల పెంపు ఉండదని తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందన్నారు. మహిళలు విధిగా జీరో టికెట్లు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీఓఓ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సీటీఎం(ఆపరేషన్స్) జీవన్ప్రసాద్, సీఎంఈ రఘునాథ్రావు, సీపీఎం ఉషాదేవి, సీటీఎం (కమర్షియల్) సుదర్శన్, సీఈఐటీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.