5 నుంచి ఈవీఎం ల మొదటి దశ తనిఖీ: కలెక్టర్

– ఈ నెల 8 వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణ
– ‘సరైన ఓటరు జాబితా తయారీకి సహకరించాలి’
– ‘రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి’
నవతెలంగాణ –  సిరిసిల్ల
ఈ నెల 5 వతేదీ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల మొదటి స్థాయి తనిఖీ చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా తయారీ, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డ్ లోని గౌడౌన్ లో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల మొదటి స్థాయి తనిఖీపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈవీఎమ్ ల మొదటి స్థాయి తనిఖీ ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు.   ఈసీఐఎల్ ఇంజనీర్లు, ఆయా పార్టీల నాయకుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈవీఎమ్ ల మొదటి స్థాయి తనిఖీ లో రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. 01.01.2024 నాటికి 18 ఏండ్లునిండి ఓటరు గా నమోదు కానీ వారు ఎవరైనా ఉంటే…ఓటరుగా నమోదు చేయించాలన్నారు. సరైన ఓటరు జాబితా తయారీకి ప్రతీ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. డబుల్, చనిపోయిన వారి ఓటు హక్కు జాబితాలో లేకుండా తయారు చేస్తామని వివరించారు. ఓటరు జాబితా తయారీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు దానిని తప్పులు లేకుండా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ ఎస్ ఆర్-2024 తుది ఓటరు జాబితా ఫిబ్రవరి 8 వ తేదీన ప్రకటించ బడుతుందని తెలిపారు. సంబంధిత కాపీలను నియోజవర్గాల వారిగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందిస్తామని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈవీఎం వివి పేట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించటం కోసం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సహా ఆర్డీవో కార్యాలయాలలో ఈవీఎం వివి పాట్ అవగాహన ప్రదర్శన కేంద్రం ను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖిమ్యానాయక్, పూజారి గౌతమి, ఆర్డీఓలు ఆనంద్ కుమార్, మధుసూదన్, సిరిసిల్ల తహశీల్దార్ ఎండీ షఫీ మోహియొద్దిన్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.