– అనుబంధ సంఘాలకు సీఐటీయూ పిలుపు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’ నిర్వహించాలని తన అనుబంధ సంఘాలు, సమాఖ్యలకు సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సోమవారం పిలుపు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అనుసరిస్తు వివక్షకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 8న ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజున దేశవ్యాప్తంగా కేరళ సంఘీభావ దినోత్సవం నిర్వహించాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. రాజ్యాంగం కల్పించిన రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు, సమాఖ్యవాదం రక్షణ కోసం ఈ సంఘీభావ దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించాలని సిఐటియు పిలుపునిచ్చింది. రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణంపై దాడులను, ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్షను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని సీఐటీయూ ఈ సందర్భంగా తెలిపింది. గత ఏడాది ఆగస్టు 24న జరిగిన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఐక్య వేదిక జాతీయ సమావేశంలో సమాఖ్య నిర్మాణంపై జరిగే అన్ని రకాల దాడులను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేసింది. నిరంకుశ మోడీ పాలనకు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం నిర్వహించాలని తన అన్ని కమిటీలు, యూనిట్లుకు సీఐటీయూ పిలుపునిచ్చింది. కేరళలోని ఎల్డీఎఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా అనుకూల విధానాలను అనుసరిస్తోందని, అలాగే ప్రజా సంక్షేమం, ప్రభుత్వ సంస్థలను రక్షించడానికి గట్టిగా నిలబడుతోందని సీఐటీయూ తెలిపింది. కాబట్టి కేరళ సంఘీభావ దినోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని తన అనుబంధ సంస్థలకు, సభ్యులకు సీఐటీయూ విజ్ఞప్తి చేసింది.