ప్రవేశ పరీక్షకు 87.79శాతం హాజరు

ప్రవేశ పరీక్షకు 87.79శాతం హాజరు– బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షకు 87.79 శాతం విద్యార్థులు హాజరయ్యారని టీజీఆర్‌డీసీ సెట్‌ కన్వీనర్‌, తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఆయా డిగ్రీ కళాశాలల్లో కోర్సుల ప్రవేశ పరీక్ష కోసం 18,989 దరఖాస్తులు రాగా పరీక్షకు 16,564 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్షను 64 కేంద్రాల్లో, బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీలో సీట్ల ప్రవేశ పరీక్షను 208 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించినట్టు తెలిపారు. బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 88.02శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో సీట్ల కోసం 47,463 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 41,775 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు.