– మైనారిటీ హక్కుల పరిరక్షణకు రెట్టింపు కృషి చేయాలి :ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ పిలుపు
న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 54వ సమావేశాల ప్రారంభం రోజునే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ తుర్క్ హర్యానా, మణిపూర్లో తలెత్తిన హింసాకాండ గురించి ప్రస్తావించారు. సోమవారం ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వోల్కర్ ఆ సమావేశంలో మాట్లాడుతూ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం రెట్టింపు కృషి జరపాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితులు ఎలా వున్నాయో ఆయన తన ప్రసంగంలో వివరించారు. భారత్లో నెలకొన్న పరిస్థితుల గురించి మానవ హక్కుల కమిషనర్ మాట్లాడుతూ, సమాజంలో వెనుకబాటుకు గురవుతున్న మైనారిటీ కమ్యూనిటీలు హింస, వేధింపులు, వివక్షకు గురవుతున్నట్టు తమ కార్యాలయానికి సమాచారం అందుతోందని చెప్పారు. చాలా సందర్భాల్లో ఇటువంటి దాడులకు గురయ్యేది ఎక్కువగా ముస్లింలేనని అన్నారు. ఇటీవల ఉత్తర భారతంలో ముఖ్యంగా హర్యానా, గుర్గావ్ల్లో జరిగిన దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. గత నెలలో హర్యానా వ్యాప్తంగా చెలరేగిన హింస, ఘర్షణలు దాదాపు వారం పాటు సాగాయి. ఏడుగురు చనిపోగా, 200మందికి పైగా గాయపడ్డారు. గత నాలుగు మాసాలుగా జాతుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్న మణిపూర్ పరిస్థితిని ఆయన తన ప్రసంగంలో వివరించారు. మణిపూర్లో ఇతర కమ్యూనిటీలు కూడా హింసను, అభద్రతను ఎదుర్కొంటున్నారని అన్నారు. నివేదికల ప్రకారం చూసినట్లైతే 200మందికి పైగా మరణించ గా, 70వేల మందికి పైగా నిర్వాసితుల య్యారని తెలిపారు. అసహనం, విద్వేష ప్రసంగాలు, మతో న్మాదం, వివక్ష వంటి పరిస్థితులను మరింత సూటిగా, స్పష్టమైన రీతిలో భారత ప్రభుత్వం ఎదుర్కొనాలని, మైనారిటీలందరి హక్కుల పరిరక్షణ కోసం కృషిని రెట్టింపు చేయాల్సిన అవసరం వుందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెనాల్టీలను పెంచేందుకు దైవ దూషణ చట్టాలను సవరించే ఆలోచనను పాక్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఫైసలాబాద్లో పెద్ద సంఖ్యలో అల్లరిమూక డజన్ల సంఖ్యలో చర్చిలను ధ్వంసం చేయడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో మానవ హక్కుల పరిస్థితిపై కూడా తుర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.