మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీలపై స్టే ఎత్తేయించండి

– మంత్రి హరీశ్‌రావుకు టీఎంఎస్టీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలపై ఉన్న స్టేను ఎత్తేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్టీఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు, రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని వేర్వేరుగా సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు, సహాధ్యక్షులు ఎల్లయ్య కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు పదోన్నతులు కల్పించాలని కోరారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లకు డెత్‌ గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వర్తింపచేయాలని సూచించారు. పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని తెలిపారు. 2013 నుంచి 2018 వరకు రావాల్సిన సీపీఎస్‌ మ్యాచింగ్‌ గ్రాంట్లను విడుదల చేయాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.