వేతనాల్లోనూ వివక్షే..!

Discrimination in wages too..!– కులం, మతమూ ప్రాతిపదికే
– అల్పాదాయ పనుల్లో మహిళలకు ఇంకా తక్కువ
న్యూఢిల్లీ : వివక్షను అంతం చేయడంపై ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. సమాన పనికి సమాన వేతనమన్న సూత్రం అనేక చోట్ల అపహాస్యానికి గురవుతున్నది. వేతనాల్లో లింగ వివక్ష తో పాటు సామాజిక వివక్ష యథేచ్ఛగా కొనసాగు తున్నది. ఒకే పనిచేసే ఉన్నత కులస్తులకు, అదే పని చేసే దళిత కులాలకు మధ్య వేతనాల్లో వ్యత్యాసం ఉంటుండగా, అక్కడ కూడా పురుషుల కన్నా స్త్రీలకు తక్కువ వేతనం లభిస్తోంది. తక్కువ ఆదాయం వచ్చే పనుల్లో ఈ వివక్ష చాలా ఎక్కువగా ఉంటోంది. అజీమ్‌ ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ఎంప్లారుమెంట్‌ విభాగం దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం నిర్ధారణైంది. కులం ఆధారంగా, మతం ఆధారంగా ఈ వివక్ష కొనసాగుతుంది. అధిక జీతాలు పొందే ఉద్యోగాల్లో తప్ప మిగిలిన అన్ని రకాల ఉద్యోగ, ఉపాధి పనుల్లోనూ మహిళలకు పురుషుల కన్నా తక్కువ వేతనాలు అందుతున్నాయి. బాగా చదువుకుని ఉన్నతస్థాయి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు వేతనాల గురించి సంబంధిత యాజమాన్యాలతో బేరమాడే శక్తి ఎక్కువగా ఉందని, అందువల్లే ఉన్నతస్థాయిలో వివక్ష కని పించడం లేదని ప్రేమ్‌జీ యూనివర్సిటీ చేసిన అధ్యయనాన్ని విశ్లేషించిన జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీలోని సెంటర్‌ ఫర్‌ న్యూ ఎకనమిక్స్‌ స్టడీస్‌లోని ఇన్‌ఫో స్పియర్‌ టీమ్‌ పేర్కొంది. ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం అధ్యయన నివేదిక, జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీ విశ్లేషణలు ‘సామాజిక గుర్తింపు భారతదేశంలో ఇంకా కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంలోనే కాదు. వేతనాల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. కొన్ని రకాల పనుల్లో కొన్ని సామాజిక వర్గాలే కనిపిస్తున్నాయి. ఆ పనుల్లో కూడా స్రీ, పురుష వివక్ష కనిపిస్తోంది.’ అని పేర్కొన్నాయి. స్వయం ఉపాధి రంగంలో అవే పనులు చేసే పురుషుల కన్నా స్త్రీలకు 40 శాతం తక్కువ సంపాదన ఉందని ఈ సర్వేలో తేలింది. క్యాజువల్‌ వేజ్‌ ఉద్యోగాల్లో 64 శాతం, సాధారణ వేతన పనుల్లో 76శాతం ఈ వ్యత్యాసం కనిపిస్తోందని ఈ సర్వేలో తేలింది. అంటే రోజువారి వేతనాల ప్రాతిపదిక పొందే ఉపాధి పనుల్లో వివక్ష అధికంగా ఉంది. ప్రతి కులంలోనూ పురుషుల కన్నా మహిళలకు తక్కువ వేతనం లభిస్తోంది.
సాధారణ వేతనాల్లో ఇలా…
రెగ్యులర్‌ వేజ్‌ (సాధారణ వేతనాల) విభాగంలో ఎస్‌సీ, ఎస్‌టీలకు నెలకు 13,735 రూపాయలు వేతనం లభిస్తుం డగా, ఇతరులకు 18,005 రూపాయలు వేతనం లభిస్తో ంది. ఈ విభాగంలో హిందువులకు 17,197 రూపాయలు నెలకు సగటున లభిస్తుండగా, ముస్లింలకు 13,550 రూపా యలు మాత్రమే లభిస్తున్నాయి. మొత్తం మీద పురుషులకు 17,910 రూపాయలు సగటు వేతనం లభిస్తుండగా, స్త్రీలకు 13,666 రూపాయలు దక్కుతున్నాయి.
స్వయం ఉపాధి రంగంలో …
సొంతంగా ఏదోఒక పనిచేసుకుని పొట్టపోసుకునే వారి సంపాదనలోనూ అంతరాలు ఉన్నాయి. ఒకే రకమైన పని చేస్తున్నా ఎస్‌సీ, ఎస్‌టీలకు 8,271 రూపాయలు నెలకు లభిస్తుండగా, ఇతరులు 11,539 రూపాయలు సంపాది స్తున్నారు. హిందువులకు సగటున 10,663 రూపాయలు లబిస్తుండగా, ముస్లింలకు 10,395 రూపాయలు మాత్రమే మిగతా 2లో లభిస్తున్నది. ఈ విభాగంలో పురుషులతో పోలిస్తే మహిళల సంపాదన చాలా తక్కువగా ఉంది. పురు షులు సగటున 12,099 రూపాయలు సంపాదిస్తుం డగా, మహిళలకు కేవలం 4,809 రూపాయలు మాత్రమే దక్కు తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. చిన్న వ్యాపారులు చేసు కునే మహిళలు అథిక వివక్షకు గురికావాల్సివస్తోంది. వీరికి రుణాలు లభించడం కూడా కష్టమవుతుంది. కుల, మతాల కు అతీతంగా మహిళల పట్ల ఈ వివక్ష కొసాగుతోంది.
క్యాజువల్‌ వేతనాల్లో …
క్యాజువల్‌ వేతనాల విభాగంలో ఎస్‌సీ, ఎస్‌టీలకు రోజుకు సగటున 309 రూపాయల వేతనం లభిస్తుండగా, ఇతరులకు 344 రూపాయలు లభిస్తుంది. మొత్తంమీద పురుషులకు 358 రూపాయలు వేతనం వస్తుండగా. స్త్రీలకు 230 రూపాయలు మాత్రమే లభిస్తున్నాయి.ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ మహిళలు పురుషుల కన్నా కొంత వెనుకబాటుకు గురై ఉన్నారని ఈ అధ్యయనం పేర్కొంది. తరతరాలుగా సమాజంలో పేర్కొ న్న భావజాలం దీనికి కారణమని నిర్ధారించింది. మూడవ, నాల్గవ దశకంలో ముస్లింల సంపాదన హిందువుల సంపాదనలో 94 శాతంగా ఉండేదని ప్రస్తుతం అది 74 శాతానికి పడిపోయిందని నివేదిక తెలిపింది. కొన్ని పనుల్లో ముస్లింలు హిందువుల కన్నా ఎక్కువ ఆదాయం సంపాది స్తున్పటికీ వెనుకబాటుతనం మాత్రం ముస్లింలలోనే అధికంగా ఉందని నివేదిక పేర్కొంది. హిందు, ముస్లిం కార్మికుల మధ్య పెరుగుతున్న ఈ అంతరం ఆందోళన కరంగా ఉందని నివేదిక పేర్కొంది.