– ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం
– ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం : విలేకరుల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు.. అమలు విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు.. మళ్లీ మోసం చేసేందుకు మోడీ, కేసీఆర్ కొత్త పథకాలు, నిధులు ప్రకటిస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడం లేదన్నారు. ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, ఆ పార్టీల కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందిస్తూ నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. యూనిట్ల వారీగా పథకాలు మంజూరు చేసి ఆ సామాజిక తరగతి మొత్తం డబ్బులను పంచుకోవాలని సూచించడం సరైంది కాదన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు, కాంగ్రెస్ను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేసుకుంటున్నారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అహంకారంతో ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై సమాధానం చెప్పలేక దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.