మతోన్మాద బీజేపీని అధికారంలోకి రానివ్వం

– బీఆర్‌ఎస్‌ రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం
– కాంగ్రెస్‌తో ఎన్నికల చర్చలు జరుగుతున్నాయి
– పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కషి చేయాలి
– సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా స్థాయి శిక్షణాతరగతులను ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట
మతోన్మాద బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విఘ్నేేశ్వర ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి శిక్షణా తరగతులను తమ్మినేని ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని,తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద చర్యలకు పాల్పడుతూ మేధావులను జర్నలిస్టులను హక్కుల కార్యకర్తలను అంతం చేస్తుందన్నారు. దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కార్పొరేట్‌ శక్తులకు అక్రమంగా అప్పనంగా కట్టబెడుతుందని ఆరోపించారు. దేశంలో లాభాలలో ఉన్న ఎల్‌ఐసి, రైల్వే, పోస్టల్‌, విమాన యానం, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అంబానీ, ఆదానీలకు కట్టబెడుతుందని విమర్శించారు. దేశంలో బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలు మోపారని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడం మూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మహిళ బిల్లును వెంటనే ఆమోదింప చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఎన్నో సంవత్సరాలుగా కులగణన చేపట్టాలని అన్ని పార్టీలు కోరుతుంటే బిజెపి మాత్రం కులగణన చేపట్టటం లేదని ఆరోపించారు. కులగణన చేపట్టడం మూలంగా అట్టడుగు వర్గాల లో ఉన్న బీసీలకు ఎంతోలాభం జరుగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఈ ఒక్క వాగ్దానాన్ని నేటికి అమలు చేసిన పాపాన పోలేదన్నారు.పాత హామీలకే గతి లేదు కానీ కొత్త హామీలివ్వడంలో అర్ధం లేదన్నారు. రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు,కేటీఆర్‌ ప్రకటనలు అవకాశవాదంగా ఉన్నాయన్నారు. 2024 ఎన్నికల్లో ఎటువైపు ఉంటారో చెప్పకుండా గెలిచే పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం ధ్వజమెత్తారు.బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీతో లోపాయి కార ఒప్పందంలో భాగంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.కాంగ్రెస్‌తో చర్చలు జరుగు తున్నాయని, త్వరలో సీట్ల సర్దుబాటు జరుగుతుందన్నారు.ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
మతం -మతోన్మాదం…
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు భాగంగా మతం, మతోన్మాదం అని క్లాసు రాష్ట్ర ఎడ్యుకేషన్‌ కమిటీ నాయకులు బండారు రమేష్‌ బోధించారు.శిక్షణాతరగతుల సందర్భంగా పార్టీ పతాకాన్ని సీనియర్‌ నాయకులు నాగిరెడ్డి శేఖర్‌ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు.ఈ తరగతులలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవగేయాలు పలువుర్ని ఆకట్టుకున్నాయి.జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఈ శిక్షణా తరగతుల్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టిపెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.