భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

– జిల్లా కలెక్టర్‌, జేసీలను కలిసిన జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సొసైటీ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
నల్లగొండ జిల్లా కేంద్రంలో సమస్త జర్నలిస్టుల తరఫున సంప్రదింపులు జరిపి భారీ ఎత్తున జరిగిన భూఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించాలని నల్లగొండ హౌసింగ్‌ సొసైటీ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని జీవో నెంబర్‌ 59 ద్వారా పట్టాలు చేసుకున్న వారందరూ ఎంతటి వారైనా సత్వర విచారణ పూర్తిచేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో మొదట ఇచ్చిన సమచారంతో కూడిన వినతి పత్రం తర్వాత పూర్తిస్థాయి సమాచారంతో మరొకమారు జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ని కలిసి వినతిపత్రం అందజేసి పూర్తి ఆధారాలను సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్‌ తగు విచారణ చేసి జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా సొసైటీ నాయకులు గార్లపాటి కష్ణారెడ్డి, గుండగోని జయశంకర్‌ గౌడ్‌లు మాట్లాడుతూ పట్టణంలోని పానగల్లు రెవిన్యూ పరిధిలోని 148, 149 సర్వే నెంబర్లలో గొల్లగూడ రెవెన్యూ శివారులోని 370, 371 లలో ఉద్దేశ్యపూర్వకంగానే భూ ఆక్రమన జరిగిందని, రెవెన్యూ మున్సిపల్‌ అధికారులు గత 13 సంవత్సరాలుగా నివాసముంటున్నట్లు ప్రభుత్వ జీవో నెంబర్‌ 59 ప్రకారం రెగ్యులర్‌ చేయాలని దరఖాస్తు చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ జరుపకుండానే తప్పుడు ఇంటి నెంబర్లను కేటాయించారని ఆరోపించారు. నల్లగొండ తాహశీల్దార్‌ ఇరిగేషన్‌శాఖ పరిధిలోని సర్వేనెంబర్‌ 148, 149లలో పానగల్లు లోని ఎస్‌ఎల్బీసీ క్వార్టర్స్‌ను భూమిని ఇంటి స్థలాలుగా రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. ఈ విషయంపై గతంలో కూడా ఫిర్యాదు చేశామని, వెంటనే విచారణ జరిపి సంబంధిత అధికారులపై, ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కొంతమంది జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నల్లగొండ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ నాయకులు మామిడి దుర్గాప్రసాద్‌, గాదె రమేష్‌, దండంపల్లి రవికుమార్‌, మహేశ్వరం రాంప్రసాద్‌, కోమటిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఉబ్బని సైదులు, జిల్లా యాదయ్య, జిల్లా రాజశేఖర్‌, గోలి సైదులు, అశోక్‌, కత్తుల హరి, సత్యం, సభ్యులు ఉన్నారు.