అక్టోబరు ఏడవ తేదీన హమస్ సాయుధులు జరిపిన దాడులలో 1400 మరదికి పైగా మరణించారు. దానికి ప్రతీకారం పేరుతో ఇప్పటివరకు ఇజ్రాయెల్ మిలిటరీ, యూదు దురహంకార సాయు ధులు పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో జరుపుతున్న దాడుల్లో మరణాలు, గాయపడిన వారు ఐదు, పదిహేనువేలు దాటారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపేందుకు ఎవరూ ఉండటం లేదనే శీర్షికతో అల్ జజీరా పత్రిక వార్త ఇచ్చింది. దానిలో పేర్కొన్నదాని ప్రకారం సోమవారం నాటికి గాజాలో 2,055 మంది పిల్లలు, 1,119 మంది మహిళ లతో సహా 5,087 మంది మరణిం చారు. గాయపడిన వారు 15,273 మంది. వీరుగాక పాలస్తీనాలో ఆక్రమిం చిన పశ్చిమ గట్టు ప్రాంతంలో ఇజ్రాయెలీ మూకలు మరో 95 మందిని చంపగా 1,650 మంది గాయ పడ్డారు. ఇక హమస్ జరిపిన ఒక రోజు దాడిలో1,405 మంది మరణిం చగా, 5,431 మంది గాయపడ్డారు.వీరు గాక పాలస్తీనా లో 720 మంది పిల్లలతో సహా1,400 మంది కనిపిం చటం లేదు. పశ్చిమ గట్టు ప్రాంతంలో 1,215 మందిని ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. బందీలుగా ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీ వృద్ద మహిళలను మానవతాపూర్వక వైఖరితో హమస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ప్రతీకార ఏకపక్ష దాడులతో ఇరవై మూడులక్షల మంది గాజా పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తదాహం తీరని యూ దు దురహంకారులు పశ్చిమ దేశాలు ఇస్తున్న మద్దతుతో మరింతగా దాడులు చేసి జనాన్ని మట్టుపెట్టాలని చూస్తు న్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి.
దాడులు, మారణకాండ నివారణలో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. ఇజ్రాయెల్ పూర్తి యుద్ధ సన్నాహాల్లో ఉంది. ఒక్క గాజా మీదనే గాక ఇరుగుపొరుగు అరబ్ దేశాలను రెచ్చగొడుతూ ఉగ్రవాదుల సాకుతో అడపదడపా దాడులు చేస్తున్నది. వాటి తీవ్రతను పెంచేందుకు సరిహద్దుల్లోని తమ గ్రామాల్లో ఉన్న జనాన్ని ఖాళీ చేయిస్తున్నది. దానికి ప్రతిగా లెబనాన్ కూడా తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ఇజ్రాయెల్-అమెరికా కూటమి దేశాల దుండగాలను నివారించేందుకు, పాలస్తీనియన్ల తరఫున అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఇరుగు పొరుగు దేశాలు కూడా సిద్దపడుతున్నాయి. మరోవైపున అమెరికా, ఐరోపాలోని అనేక పట్టణాల్లో లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి గాజాపై దాడులను నిరసిస్తున్నారు. యూదుల రక్షణ పేరుతో అరబ్బులపై మారణకాండకు పూనుకోవద్దని కోరుతున్న వారిలో యూదులు అనేకమంది ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. శనివారం నాడు భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించిన ఒక తీర్మానంలో ఇజ్రాయెల్కు ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఉందంటూ సమ ర్ధనకు పూనుకుంది.దాడుల విరమణకు ఇది సమయం కాదని ప్రకటించింది. గాజాలో జరుపుతున్న కొన్ని దాడులు ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బకావచ్చని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించాడు.దాడులకు మద్దతు తెలి పేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ మంగళవారం నాడు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ చేరుకు న్నాడు. తాజా పరిణామాలను చర్చించేం దుకు గురువారం నాడు ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశం జరగనుంది.
గాజా ప్రాంతంలో చిక్కుకు పోయిన ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులు రెండు వందల మందికి పైగా హమస్ చేతుల్లో బందీలుగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన తరువాతే కాల్పుల విరమణ గురించి మాట్లాడాలని అమెరికా అధినేత జో బైడెన్ చెప్పాడు. ఏదో విధంగా వారిని విడిపించు కున్న తరువాత ఇప్పటి వరకు వైమానిక దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ తదుపరి దశ పేరుతో భూతల దాడులకు సిద్దం అవుతున్నది. ఇదంతా హమస్ను నాశనం చేసే పేరుతో జరుగుతోంది.మరణించిన వారిలో 70 శాతం మంది పిల్లలు, వృద్దులు, మహిళలే ఉన్నారు. అంటే జనం మీదనే దాడి జరుగుతోందన్నది స్పష్టం. మరింతగా పెరిగితే లెబనాన్లోని హిజబుల్ వంటి సాయుధ శక్తులు ప్రతిదాడులకు సిద్దం అవుతున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా ప్రత్యక్షంగా దాడులకు దిగేందుకు అమెరికా రంగం సిద్దం చేసుకుంటున్నది. దానికిగాను తమ సైనికులపై దాడులు జరిగినట్లు కట్టుకథలను ప్రచారంలో పెట్టింది. అక్టోబరు 19,20 తేదీలలో ఎమెన్ నుంచి తమ మీద, ఇజ్రాయెల్పై ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసినట్లు ప్రకటిం చింది. అదంతా రాత్రి సమయంలో సముద్ర జలాల మీద జరిగింది గనుక ఎలాంటి ఆనవాళ్లు ఉండవని అధి కారులు చెప్పారు. నిజానికి ఎమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సాయుధుల రాడార్ కేంద్రాలపై అమెరికా నౌకా దళమే ఎర్ర సముద్రం నుంచి క్షిపణులతో దాడి చేసి రెచ్చగొట్టిందని వార్తలు.ఎమెన్ రాజధాని సనా నగరంతో సహా ఉత్తర ప్రాంతం హౌతీల ఆధీనంలో ఉంది. వారి మీద పోరాడుతున్న ఎమెన్ ప్రభుత్వానికి 2015 నుంచి సౌదీ అరేబియా మద్దతు ఇస్తున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్-సౌదీ మధ్య సయోధ్య కుదిరిన నేపధ్యంలో గతంలో మాదిరి హౌతీ దళాలు సౌదీపై క్షిపణులు ప్రయోగించే అవకాశం లేదు. అందువలన అసలు నిజంగా ప్రయోగించారా లేక ఆ పేరుతో అమెరికా నాటకం ఆడుతోందా అన్న అనుమా నాలు తలెత్తాయి. అమెరికా గనుక గాజాపై దాడికి జోక్యం చేసుకుంటే తాము దాడులకు దిగుతామని, గీత దాటవద్దని హౌతీ దళాల నేత అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ హెచ్చరించాడు.
ఇప్పటికే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న పేట్రియాట్ గగనతల క్షిపణి బెటాలియన్కు తోడు థాడ్ రక్షణ వ్యవస్థను కూడా పంపనున్నట్లు అమెరికా వెల్లడిం చింది. ఇప్పటికే రెండు విమానవాహక యుద్ధ నౌకలు, వాటికి అనుబంధ నౌకలతో పాటు రెండువేల మంది మెరైె న్లను మోహరించింది. శనివారం నాడు కైరోలో జరిగిన శాంతి సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగి సింది. ఇజ్రాయెల్ హాజరు కాలేదు. కైరోలోని ఒక జూని యర్ అధికారిని అమెరికా పంపింది, అతగాడు నోరు విప్పలేదు. అరబ్ నేతలు గాజాపై దాడులను ఖండిం చారు. ఐరోపా దేశాల నుంచి వచ్చిన వారు దాడుల నుంచి పౌరులను మినహాయించాలని సూచించారు. హిజబుల్లా మీద దాడులకు పూనుకోవద్దని జో బైడెన్, ఇతర నేతలు ఇజ్రాయెల్కు సూచిస్తున్నారని, అదే జరిగితే తాము కూడా యుద్ధంలో ప్రవేశించాల్సి ఉంటుదని కొన్ని అరబ్బు దేశాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే ఇజ్రాయెల్ తన దక్షిణ, ఉత్తర భాగంలో దాడులను ఎదు ర్కోవాల్సి వస్తుంది, అప్పుడు అమెరికా-ఇరాన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మధ్యధరా సముద్రంలో అమెరికా మిలిటరీ కేంద్రీకరణ నేపధ్యంలో చైనా ఆరు యుద్ధ నౌక లను ఆ ప్రాంతానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటి గురించి చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన చేస్తూ మే నెల నుంచి తమ నౌకలు ఆ ప్రాంతంలో ఉన్నాయని, గత వారంలో ఓమన్ నౌకాదళంతో కలసి సంయుక్త విన్యా సాలు సాగించినట్లు పేర్కొన్నది. అవి పూర్తైన తరువాత అక్టోబరు 18వ తేదీన కువైట్ రేవు షావయాఖ్కు తమ నావల్ ఎస్కార్ట్ దళాలు వచ్చినట్లు తెలిపింది. వాటిలో నిర్ణీత లక్ష్యాలను ఛేదించే క్షిపణి నౌక, ఫ్రైగేట్, ఇతర నౌకలు ఉన్నాయి. చైనా-కువైట్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరి ఐదు సంవత్సరాలు అవుతున్నది. పది సంవత్సరాలుగా బిఆర్ఐ పధకం కింద పెట్టుబడులు పెట్టింది. చైనా నౌకలు ఎందుకు వచ్చిన ప్పటికీ ఈ ప్రాంతంలో రాజకీయంగా వాటి ప్రభావం ఉంటుంది. అమెరికా మిలిటరీ శక్తిని చూసి ఆందోళన చెందుతున్న శక్తులకు భరోసా దొరికినట్లు అవుతుంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిమితంగా జరుపుతున్న దాడులు, ఒకవేళ వాటి తీవ్రతను పెంచితే రాగల పరిణా మాలు, పర్యవసానాల గురించి అమెరికా మదింపు వేస్తోం ది. ఇరాన్ అందచేసిన డ్రోన్లు, ఇతర ఆయుధాలతో హమస్ కంటే పెద్దశక్తిగా ఉన్న హిజబుల్లా గనుక పోరుకు దిగితే తీవ్ర పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతు న్నారు. హమస్ దగ్గర పరిమితమైన ఆయుధాలు మాత్ర మే ఉన్నాయి, శిక్షణ పొందిన హిజ్బుల్లా దగ్గర స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు, డ్రోన్లు, మానవరహిత ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని రంగంలోకి దింపితే పోరు తీరే మారిపోతుంది. ప్రస్తుతం అది యుద్ధాన్ని కోరుకో వటం లేదని, అమెరికా, ఇజ్రాయెల్ గనుక వారిని ఆవైపుకు నెడితే రంగంలోకి దిగుతుందని పరిశీలకులు అంటు న్నారు. బహుశా దానిలో భాగంగానే లెబనాన్ సరిహద్దు లో ఉన్న హిజబుల్లా సాయుధులపై ఇజ్రాయెల్ దాడులు చేసి కవ్విస్తున్నది.2019లో అమెరికా మిలిటరీ గూఢ చారుల సమాచారం మేరకు హిజబుల్లా వద్ద లక్షా 50వేల రాకెట్లు, ఇజ్రాయెలీ సంస్థ ఒకటి గతేడాది చెప్పినదాని ప్రకారం రెండువేల మానవరహిత ఆయుధ ప్రయోగ వాహనాలు ఉన్నాయి. వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే ఆయుబ్, షాహేద్ వంటి క్షిపణులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద అధునాతన వైమానిక దళం ఉన్నప్పటికీ హిజబుల్లా వంటి సంస్థల వద్ద ఉన్న నిఘా, ఇతర పరిక రాలతో గురిచూసి విమానాలను కూల్చివేసే అవకాశం ఉంది. ఐరన్ డ్రోమ్, ఐరన్ బీమ్ వంటి రక్షణ వ్యవస్థల గురించి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ అవి ఎంతవరకు దాడులను నివారించగలవో ఇంతవరకు రుజువు కాలేదు. గడచిన ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా యోధులను అణచేందుకు ఇజ్రాయెల్ చేయని ప్రయోగం లేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త శక్తులు, గెరిల్లా పద్దతుల్లో దాడులతో తెగబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు హమస్ను అణచివేయటం కూడా జరిగేది కాదని చెబుతున్నారు. ఇజ్రాయెల్ తాను చేయదలచుకున్న విధ్వంసాన్ని నెల రోజు ల్లోపల పూర్తి చేయాలని తరువాత అమెరికా అనుమతించే అవకాశం ఉండదని, భూతల దాడికి దిగితే ఇజ్రాయెల్ కూడా భారీసంఖ్యలో సైనికులను కోల్పోతుందని, దాంతో పౌరుల్లో సహనం కూడా నశిస్తుందని ఒక నిపుణుడు చెప్పాడు. 2006లో జరిగిన రెండవ లెబనాన్ పోరులో హిజబుల్లా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులను హత మార్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకుంది. ప్రస్తుతం లక్ష మంది యోధులు న్నట్లు అంచనా. ఇజ్రాయెల్ పరిసరాలన్నీ నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రపంచ శాంతి శక్తులు కోరుతున్నట్లు యూదు దురహంకారులు వెనక్కు తగ్గుతారా అమెరికా, ఐరోపా ధనిక దేశాల అండ చూసుకొని మరింతగా మారణకాండకు పాల్పడతారా అన్నది చెప్పలేము.
– ఎం కోటేశ్వరరావు
8331013288