బీజేపీతో బంధం వినాశకరం

Relationship with BJP is disastrous– ఆ పార్టీ విషకౌగిలి నుంచి బయటపడాలి
– వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు సీపీఐ(ఎం) సూచన
– ఏపీలోని సీతంపేట, ఆదోనీల్లో ప్రజారక్షణ భేరీ ప్రారంభం
విజయనగరం : బీజేపీతో బంధం వినాశనకరమని, ఆ పార్టీ విషకౌగిలి నుంచి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బయటకు రావాలని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరిలో భాగంగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. సీతంపేటలో ప్రచార భేరిని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ యాత్ర పాలకొండ, కురుపాం మీదుగా పార్వతీపురం వరకూ సాగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రారంభమైన యాత్ర కర్నూలు వరకూ సాగింది. ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, గిరిజనులు ఘన స్వాగతం పలికారు.
గిరిజన చట్టాలను కాలరాస్తున్న బీజేపీ వత్తాసు పలుకుతున్న వైసీపీ, టీడీపీ : బివి రాఘవులు
గిరిజన చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఆ ప్రభుత్వానికి రాష్ట్రంలోనే వైసీపీ, టీడీపీ వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా రావాడ రోడ్డు జంక్షన్‌, పార్వతీపురంలలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గిరిజనులు పోరాడి సాధించుకున్న చట్టాలను సవరించి వారిని దోపిడీ చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే అటవీ హక్కుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. చట్ట ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికీ గరిష్టంగా పది ఎకరాలు వరకు భూమి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ తూతూమంత్రంగా పంపిణీ జరిగిందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కొండ కోనలను ధ్వంసం చేసి అందులో నిక్షిప్తమైన గనులను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదాత్తం చేస్తోందన్నారు. ఇందుకోసం పీసా చట్టానికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధుల ను తగినంతగా కేంద్ర ప్రభుత్వం కేటాయించట్లేదని అన్నారు. ఆరకొరగా కేటాయించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని విమర్శించారు.
సాధికార యాత్ర చేపట్టే నైతిక హక్కు వైసీపీకిలేదు : వి శ్రీనివాసరావు
రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర చేపట్టే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అడవులు, భూములు, గనులు వంటి సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వైసీపీ జతకట్టిందని విమర్శించారు. ఉపాధి నిధులు కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని, అరకొరగా వచ్చిన విధులను సీఎం జగన్‌ మళ్లిస్తున్నారని తెలిపారు. పేదలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చిన భూములను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో తాగునీరు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలు తగినంతగా లేవన్నారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
బీజేపీని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలి : అశోక్‌ ధావలే
రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రజారక్షణ భేరిని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలులో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి గతంలో ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, ఇప్పుడు ఒకటి, ఒకటిన్నర క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, అలాంటి దుర్భర పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యధిక ప్రాంతాల్లో పండే వరికి క్వింటాలుకు కేంద్రం రూ.2,100 మాత్రమే మద్దతు ధర ప్రకటించిందని, కేరళలోని వామపక్ష ప్రభుత్వం రూ.2,850 ఇస్తోందని తెలిపారు. దేశానికి, అసమానతలు లేని అభివృద్ధికి వామపక్షాలే ఏకైక ప్రత్యామ్నాయన్నారు. విద్యను ప్రయివేటీకరణ చేయడానికి కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందనీ, చరిత్రను వక్రీకరించి ఆర్‌ఎస్‌ఎస్‌ పాఠాలు చేరుస్తున్నారని, విద్యను కాషాయీకరణ చేయాలని చూస్తున్నారని తెలిపారు. బీజేపీతో కలిసి వెళ్లే ఏ పార్టీతోనూ సీపీఐ(ఎం) కలిసి వెళ్లదని స్పష్టం చేశారు.