ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ డీ

ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్‌ హవా కొనసాగనుంది. రెండోసారి ముఖ్యమంత్రి– కాంగ్రెస్‌ సానుకూలం సీఎం భఘేలానే బీజేపీకీ సీఎం ముఖం లేదు
– సీఎం భూపేశ్‌ బఘేల్‌కు ప్రత్యామ్నాయమే ఉందా?
ముఖ్యమంత్రి భూపేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ కలిగున్న నేతగా ఎదిగారు. ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో సొంత ప్రాంతమైన ఉత్తర ప్రాంతంలో భూపేశ్‌కు ఆధరణ కొంత తక్కువ ఉంది. సెంట్రల్‌, దక్షిణ ప్రాంతాలలో సానుకూలంగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఆత్మగౌరవం, గుర్తింపు కోసం ముఖ్యమంత్రి కష్టపడుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపులున్నా భూపేశ్‌కు సరితూగే నేతలు లేరని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. బీజేపీలో ఇప్పటికీ రమణ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రాధాన్యత లభిస్తుండగా ఆయనను ప్రస్తుత సీఎం భూపేష్‌ కు సరైన ప్రత్యామ్నాయంగా భావించకపోవడం గమనార్హం.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్‌ హవా కొనసాగనుంది. రెండోసారి ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేలా అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 71, బీజేపీకి 15, బిఎస్పీకి 2 జేసీసీకి 1 స్థానాలున్నాయి. 90 నియోజకవర్గాల్లో 32 ఎస్టీ రిజర్వుడు స్థానాలు. అందుకే దీన్ని ట్రైబుల్‌ స్టేట్‌ అంటారు. 10 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. 47 శాతం ఓబీసీ, 32 శాతం ఎస్టీ, 12 శాతం ఎస్సీ, 7 శాతం ఇతరులు, 2 శాతం ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కుల గణన అస్త్రాన్ని ప్రయోగించింది. ఇది బీసీ వర్గాల్లో ఆ పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుంది. ప్రజా నేతగా ఎదిగిన ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేలా కాంగ్రెస్‌కు సానుకూలం కాగా, మరోవైపు మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన రమణ్‌ సింగ్‌కు బీజేపీ అంత ప్రాధాన్యత ఇవ్వకపోడం, ఆ పార్టీకి ప్రతికూలం కానుంది.
కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్‌ ఛత్తీస్‌గఢ్‌ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్‌ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్‌’ వంటి నినాదాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్‌ ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ”అర్ప-పైరి కి ధర్‌” ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్‌ అంశాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడుతున్నాయి. ”రామవంగమన్‌ పాత్‌” పేరిట శ్రీరాముడు వనవాసం చేసిన రాష్ట్ర పరిధిలోని 75 స్థానాలను గుర్తించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ”బెన్‌ ములాఖత్‌” పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడుతున్నాయి. ”కహౌ దిల్‌ సే, కాంగ్రెస్‌ ఫిర్‌ సే”, ”భూపేష్‌ హై తో, భరోసా హై” వంటి నినాదాలు ప్రజలకు చేరువవుతున్నాయి. కాంగ్రెస్‌ పాలన, ముఖ్యమంత్రి పనితీరుపై 60 శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు వివిధ సర్వేలు చెబుతున్నాయి.
ప్రాంతాల వారీ రాజకీయం
ఛత్తీస్‌గఢ్‌ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు. 23 స్థానాలున్న ఈ డివిజన్‌లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో, రాష్ట్ర మంత్రి జ్కెసింగ్‌ అగర్వాల్‌ ప్రభావంతో 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ మంచి ఫలితాలను సాధించింది. సింగ్‌డియో కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం ఇక్కడ 2018లో కాంగ్రెస్‌ విజయానికి దోహదపడింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఆ పార్టీకి ఇక్కడ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల సింగ్‌డియోకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్‌కు కొంత సానుకూలంగా ఉంది.
మధ్య ఛత్తీస్‌గఢ్‌ డివిజన్‌లో రారుపూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్‌లో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్‌ స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎస్టీ, సింధి, రాజ్‌పుత్‌, పంజాబీ, బ్రాహ్మిణ్‌ సామాజిక ఓటర్ల ప్రభావం కూడా ఇక్కడ ఉంది. ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చేందిన వారే. ఈ ప్రాంతంపై పట్టున్న బీజేపీ 2018 ఎన్నికల్లో నష్టపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం కబీర్‌దామ్‌, బీమెత్ర జిల్లాల్లో మతకలహాల హింసతో ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ బీజేపీ బలపడినట్లు కనిపిస్తున్నా, సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. ఈ డివిజన్‌లో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందిన జేసీసీ, బీఎస్పీ బలహీనపడడంతో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రయోజనం కలుగుతోంది. మొత్తంమీద ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ ఆధిప్యతం కొనసాగే అవకాశాలున్నాయి.
ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాన్ని బస్తార్‌ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. ఇది నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం. బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతంలో 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను సాధించి క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎస్టీలతోపాటు గోండ్‌, మురియా, భాత్ర హల్బీట్‌ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. ఇక్కడ ఓబీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. బస్తర్‌లో మత మార్పిడి ఘటనలతో గత కొన్నేళ్లుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ ప్రాంతంలో సర్వ్‌ ఆదివాసీ సమాజ్‌ ఓట్లను చీల్చినా సీట్లు గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్‌ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి.
సామాజిక ప్రభావం
రారుపూర్‌, బిలాస్‌పూర్‌, జగదల్‌పూర్‌, అంబిక్‌పూర్‌, కోబ్రా, రాయిగఢ్‌ మొదలగు నగరాల్లో రాజపూత్‌, బ్రాహ్మిణ్‌, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒరియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటు బ్యాంక్‌ అధికం. ఓబీసీలో సాహు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల కొంత మొగ్గు ఉంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్‌ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్‌ ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్‌ కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మారర్‌ సామాజిక వర్గం కాంగ్రెస్‌ పట్ల అనుకూలంగా ఉంది.
సెంట్రల్‌ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్‌ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. దేవాంగన్‌ సామాజిక వర్గం బీజేపీ పట్ల మొగ్గు చూపుతుంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాభల్యం ఉన్న యాదవ్‌ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్సీలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్‌ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ప్రధానంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండుల ఓటర్లు కాంగ్రెస్‌, బీజేపీ, సర్వ్‌ ఆదివాసీ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్‌ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖ్కెర్వార్‌, ఓరాన్‌ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది. హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇతర పార్టీల పరిస్థితి
గూడావన గణతంత్ర పరిషత్‌ రాష్ట్రంలో ప్రభావం కోల్పోయింది. జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (మజీ సీఎం అజిగ్‌ జోగీ ఏర్పాటు చేసిన పార్టీ) 2018లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోగా ఆ కూటమి ఏడు స్థానాలు (జేసీసీ 5, బీఎస్పీ 2) గెలిచింది. అజిత్‌ జోగి మరణానంతరం జేసీసీ పూర్తిగా బలహీనపడగా, బీఎస్పీ ఒక స్థానం గెలిచే అవకాశాలున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒక స్థానం కూడా దక్కే అవకాశాల్లేవు. నూతనంగా ఆవిర్భవించిన సర్వ ఆదివాసీ సమాజ్‌ బస్తార్‌ ప్రాంతంలో గణనీయమైన ఓట్లు పొందే అవకాశాలన్నా సీట్లు దక్కకపోవచ్చు. ఈ పరిణామాల మధ్య ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే ఉండగా, కాంగ్రెస్‌ మెజార్టీ సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్‌ బలాలు, బలహీనతలు
కాంగ్రెస్‌ 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేశ్‌ బఘేల్‌ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరిని దేశంలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వం సేకరించడంతో రైతులు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంది. దీంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హౌమ్‌గార్డులకు జీతభత్యాలు పెంచడంతో వారు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు.
ఈ పరిణామాలు ప్రధానంగా గ్రామాలలో, విద్యావంతులలో పార్టీ పట్ల సానుకూలతను కలిగిస్తున్నాయి. వీధులలో సంచరించే ఆవుల కోసం ‘గోథాన్‌ యోజన’ పేరిట పథకాన్ని ప్రారంభించి గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధిని కలిగించడం పట్ల ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు.
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు
అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీకి నష్టం చేకూర్చవచ్చు. ముఖ్యమంత్రి భూపేశ్‌కు ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌.సింగ్‌డియో, పీసీసీ చీఫ్‌ మోహన్‌ మార్కం మధ్య విభేదాలున్నాయి. ముగ్గురు మూడు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇటీవల ఈ అంతర్గత కలహాలపై కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా దెబ్బతిన్న రహదారులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తోంది.
బీజేపీ బలాలు, బలహీనతలు
ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న బీజేపీ భూపేశ్‌ ప్రభుత్వం వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకపోవడంతో పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని రాష్ట్ర బీజేపీ ‘మోర్‌ ఆవాజ్‌ మోర్‌ అధికార్‌’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. బస్తార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్‌ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనలు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. గత ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్‌ ఇచ్చిన మద్య నిషేధం హామీని ఆ పార్టీ అమలు చేయకపోవడం బీజేపీకి సానుకూలంగా మారుతోంది. గతంలో పదిహేనేళ్ళు పాలించిన బీజేపీ హిందూత్వ అజెండాతోపాటు జాతీయ అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించడంలో ఇవ్వలేదని అసంతృప్తి ప్రజల్లో ఉండడం ఆ పార్టీకి నష్టం చేకూరనుంది. బీజేపీ జాతీయ అంశాలకు, హిందూత్వ అజెండాకు వ్యతిరేకంగా స్థానిక, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యతిస్తూ ప్రజలకు చేరువవడంలో ముఖ్యమంత్రి భూపేశ్‌ సఫలీకృతులయ్యారు.
పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ ఠాకూర్‌ సామాజిక వర్గానికి, పార్టీలో ఇతర ప్రముఖ నేతల్కెన సరోజ్‌పాండే బ్రాహ్మణ సామాజిక వర్గానికి, మరోనేత బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ బనియా సామాజిక వర్గానికి చెందిన నేతలు. దీంతో రాష్ట్రంలో అధికంగా ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత లేదనే భావనను కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. గిరిజన తెగకు చెందిన సీనియర్‌ నేత నంద్‌కుమార్‌ సాయి 2023 ఏప్రిల్‌లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి నష్టం చేకూర్చవచ్చు. బీజేపీ 15 ఏళ్ల పాలనలో సబ్సీడీ బియ్యం మినహా ఇతర సంక్షేమ పథకాలకు పెద్ద ప్రాముఖ్యతివ్వలేదని, అందుకే బీజేపీకి మూడు మార్లు అవకాశమిచ్చినట్టే కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశమిద్దామనే అభిప్రాయంలో ఛత్తీస్‌గఢ్‌ ఓటర్లు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.