నేడు తొలిదశ పోలింగ్‌

Today is the first phase of polling– మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల నిర్వహణకు సర్వసిద్ధం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా…తొలిదశ పోలింగ్‌ మంగళవారం జరగనున్నది.తమిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల పోలింగ్‌కు పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరగనుంది. అధికార, విపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు పోటీపడి మరీ జనాకర్షక హామీలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.
ఒకే విడతగా మిజోరంలో పోలింగ్‌
మిజోరంలో మొత్తం 40 నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ మొత్తంగా 8.50 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండగా.. వీరిలో 4,13,064 మంది పురుష ఓటర్లు 4,39,028మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా 1276 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50,611 మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు. మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాష్ట్రంలో 50 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ తన అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. జడ్‌పీఎం, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రస్తుత సర్కార్‌ను గద్దె దించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు 26 సీట్లు రాగా.. కాంగ్రెస్‌ ఐదు, బీజేపీ ఒక సీటు గెలిచాయి. ఈసారి మిజో ఓటర్లు ఎటు మొగ్గుచూపుతారో చూడాలి!
ఛత్తీస్‌గఢ్‌లోనూ…
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లో 20 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మిగతా 70 సీట్లకు రెండో విడతలో ఈ నెల 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 20 నియోజకవర్గాల్లో ఎన్నికలకు 5,304 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 60వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తొలి దశలో 40,78,680 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 19,93,936 మంది పురుషులు కాగా.. 20,84,675మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,64,299 మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. తొలి విడతలో 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 68 సీట్లతో ప్రభంజనం సృష్టించగా.. బీజేపీ 15 స్థానాలకే పరిమితమైంది.