దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిం చిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం ‘అలా నిన్ను చేరి’. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. మారేష్ శివన్ దర్శకుడు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాత. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈనెల 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ,’కర్ణాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఇది వరకు నేను చాలా సినిమాలు చేశాను. కానీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాతో మరింత చేరువవుతానని భావిస్తున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాతకు థ్యాంక్స్. చంద్రబోస్ లాంటి లెజెండరీ వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది.
ఆయన అందించిన సాహిత్యం అద్భుతం. డైరెక్టర్ మంచి కథను రాసుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం నేను ఎదురు చూస్తున్న టైమ్లోనే ఇలాంటి కథ రావడం ఆనందంగా అనిపించింది. ఇందులోని ప్రతీ పాట అద్భుతంగా ఉంటుంది. ఒక్కో పాటను ఒక్కో స్టైల్లో కంపోజ్ చేసే ఛాన్స్ దొరికింది. నవరసాలను చూపించేలా పాటలుంటాయి. సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. జావెద్ అలీ, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహెరా, సింహ, ఇంద్రావతి చౌహాన్ తదితరులు పాటలను అద్భుతంగా పాడారు. ఈ మూవీతో నా కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. సాహిత్య విలువలు, మంచి పాటలను అందించాలని నేను కోరుకుంటాను. ఇళయారాజా, దేవీ శ్రీ ప్రసాద్, హారీస్ జయరాజ్ నాకు స్పూర్తి. ఇళయారాజా పాటల్లో లిరిక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వినిపిస్తాయి. అలాంటి సంగీతాన్ని ఇవ్వాలని భావిస్తున్నాను. ఏ జోనర్లో అయినా సరే మంచి మ్యూజిక్ ఇస్తాను’ అని తెలిపారు.