బరిలో తాజా, మాజీ మంత్రులు

బరిలో తాజా, మాజీ మంత్రులు– వృద్ధాప్యంలోనూ పోటీలో సీనియర్లు
–  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గట్టి పోటీ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తాజా, మాజీ మంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు. వయస్సు మీద పడినా లెక్క చేయకుండా సీనియర్లు రంగంలో నిలుస్తుండటం గమనార్హం. జూనియర్లను ఢకొీట్టేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడా సీనియర్లే ప్రత్యర్థులుగా ఉన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పోటీ తీవ్రంగానే ఉంటుందని చెప్పొచ్చు. గెలిచేందుకు అందరూ శ్రమటోడ్చుతున్నారు.
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బ్యాంకు ఉద్యోగిగా చేసిని జూపల్లి కృష్ణారావు 1999లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన 1999లో, 2004, 2009, 2012, 2014లో వరుసగా గెలుపొందారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత బీరం బీఆర్‌ఎస్‌లో చేరగా.. జూపల్లి కాంగ్రెస్‌లో చేరారు. 2023లో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ దక్కించుకొని జూపల్లి మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీరం హర్షవర్ధన్‌ రెడ్డిపై ఏ మేరకు నెట్టుకొస్తారనేది చర్చ జరుగుతోంది.
ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్‌ లక్ష్మారెడ్డి 2023లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవిపై 45,802 ఓట్ల తేడాతో గెలిచారు. లక్ష్మారెడ్డికి 94,598 కోట్లు రాగా, మల్లు రవికి 49,516 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి అనిరుద్‌రెడ్డి రంగంలో ఉన్నారు. గట్టి పోటీ ఇస్తున్నారు. బీజేపీ తరపున చిత్తరంజన్‌ దాస్‌ ఉన్నారు. ఆయన గతంలో ఎన్టీఆర్‌పై గెలిచి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా లభించింది. ప్రస్తుతం బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.
నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్దన్‌ రెడ్డి.. టీడీపీ అభ్యర్థిగా 1985లోకాంగ్రెస్‌ ఐ అభ్యర్థి విఎన్‌ గౌడ్‌పై 1467 ఓట్లతో గెలిచారు. 1994లో 1999, 2004, 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికలలో సైతం నాగం జనార్దన్‌ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి 2023లో పోటీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ నిరాకరించింది. దాంతో బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.
మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి పని చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వనపర్తిలో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి మాజీ మంత్రి చిన్నారెడ్డి చేతిలో ఓడిపోయారు.
2018 ఎన్నికల్లో అదే చిన్నారెడ్డిపై గెలుపొందారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యనే పోటీ నెలకొంది.
మహబూబూబ్‌గర్‌ గెలిచిన మంత్రి విసరునూళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌ అంతకుముందు అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా హైదరాబాద్‌లో పని చేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇప్పుడు 2023 ఎన్నికల్లోనూ బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తలపడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నియోజకవర్గాలు ఆయా పార్టీల అభ్యర్థుల వివరాలు
నాగర్‌ కర్నూల్‌ : మర్రి జనార్దన్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌), కె.రాజేష్‌ రెడ్డి (కాంగ్రెస్‌),
కె.కుమార్‌ (బీఎస్పీ)
అచ్చంపేట : గువ్వల బాలరాజు (బీఆర్‌ఎస్‌), వంశీకృష్ణ (కాంగ్రెస్‌),
సతీష్‌ మాదిగ (బీజేపీ )
కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి (కాంగ్రెస్‌), జైపాల్‌ యాదవ్‌ (బీఆర్‌ఎస్‌), కొమ్ము శ్రీనివాస్‌ యాదవ్‌ (బీఎస్పీ )
కొల్లాపూర్‌ : బీరం హర్షవర్ధన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్‌),
ఎల్లెని సుధాకర్‌ రావు (బీజేపీ)
వనపర్తి : సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌), చిన్నారెడ్డి (కాంగ్రెస్‌)
అలంపూర్‌ : విజయుడు (బీఆర్‌ఎస్‌),
సంపత్‌ కుమార్‌ (కాంగ్రెస్‌)
గద్వాల : బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌), సరిత (కాంగ్రెస్‌)
జడ్చర్ల : లక్ష్మారెడ్డి (బీఆర్‌ఎస్‌),
అనిరుద్‌ రెడ్డి (కాంగ్రెస్‌), చిత్తరంజన్‌దాస్‌(బీజేపీ)
మహబూబ్‌నగర్‌ : శ్రీనివాస్‌గౌడ్‌ (బీఆర్‌ఎస్‌), యెన్నం శ్రీనివాసరెడ్డి(కాంగ్రెస్‌),
మిధున్‌ రెడ్డి (బీజేపీ)
దేవరకద్ర : ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి(బీఆర్‌ఎస్‌), మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్‌)
మక్తల్‌ : చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌), వాకిట శ్రీహరి (కాంగ్రెస్‌)
నారాయణపేట : రాజేందర్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌),
చిట్టెం పర్ణిక రెడ్డి (కాంగ్రెస్‌)