మిడిల్‌ క్లాస్‌ కుర్రాళ్ళ జీవిత సంఘర్షణ

మిడిల్‌ క్లాస్‌ కుర్రాళ్ళ జీవిత సంఘర్షణదినేష్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకష్ణలు హీరో,హీరోయిన్లుగా రాబోతున్న ఫీల్‌ గుడ్‌ మూవీ ‘అలా నిన్ను చేరి’. ఈ మూవీని విజన్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పిస్తున్నారు. మారేష్‌ శివన్‌ తెరకెక్కించగా కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా హీరో దినేష్‌ తేజ్‌ మీడియాతో మాట్లాడుతూ, ”అలా నిన్ను చేరి’ అంటూ కొత్తగా ప్రయత్నించాను. ఇందులో కమర్షియల్‌ రోల్‌ చేశాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ప్రతీ ఒక్క మిడిల్‌ క్లాస్‌ అబ్బాయికి ఎదురయ్యే సంఘర్షణే ఇందులో ఉంటుంది. ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అనేది చూపిస్తాం. ఆ పాయింటే నాకు ఈ సినిమా చేయడానికి స్పూర్తిని ఇచ్చింది. ‘ప్లే బ్యాక్‌’ తరువాత చాలా గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. కరోనా టైంలో వచ్చిన ‘ప్లే బ్యాక్‌’తో మంచి పేరు వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. నటుడిగా నాకూ మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ఓ సినిమా థియేటర్లోకి వచ్చింది. కానీ అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రంతో ఎలాంటి ప్రశంసలు వస్తాయో చూడాలి. సినిమాల్లోకి రావాలని ప్యాషన్‌ ఉండే గణేష్‌ అనే కుర్రాడిగా నటించాను. హెబ్బా పటేల్‌ అద్భుతంగా నటించారు. పాయల్‌ నటన గురించి ఇప్పుడు ప్రేక్షకులు తెలుసుకుంటారు. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. చంద్రబోస్‌ రాసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. మా సినిమాకు పాటలు రాస్తున్న టైంలోనే ఆయనకు ఆస్కార్‌ అవార్డ్‌ రావడం ఆనందంగా అనిపించింది. ఇక సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్‌ ఈ సినిమా తరువాత నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్తారు. మా సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్టర్‌ మారేష్‌ శివన్‌ ‘హుషారు’ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ‘జపాన్‌, జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ వంటి పెద్ద సినిమాలు వస్తున్నాయని మాకు తెలియదు. సినిమా బాగుందంటే ఆడియెన్స్‌ కచ్చితంగా చూస్తారు. మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు’ అని చెప్పారు.