నవతెలంగాణ- చిట్యాల టౌన్: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకం 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారే పథకమే తప్ప మరి ఏమీ కాదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే నకిరేకల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం అయ్యి గందరగోళం పడొద్దు అని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. కెసిఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి అయితే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి కేసీఆర్ బీమా వర్తింప చేస్తామని అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణలోనే నల్గొండ జిల్లా అత్యధికంగా వరి పండించే జిల్లాగా అభివృద్ధి చెందిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వివాహము జరిగేంత వరకు నెలకు 3000 మృతి ఇస్తామని, తెల్ల రేషన్ కార్డు ఉన్నోలందరికీ 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతుబంధు ఎకరానికి పదివేల నుండి 16 వేలకు పెంచుతామని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో 42,862 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని పదివేల 450 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చామని రైతు వేదిక వైకుంఠధామాలు నకిరేకల్లో పట్టణంలో 32 కోట్లతో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు రానున్న రోజుల్లో చిట్యాల పట్టణంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి, పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని, వెలిమినేడ్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. కారుకు ఓటు వేస్తే కెసిఆర్ సీఎం అవుతారు కానీ కాంగ్రెస్కు ఓటు వేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు డబ్బు పిచ్చి పట్టిందని అన్నారు. ఒక్క కేసీఆర్ ను ఓడించడానికి దేశంలోని ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ లాంటి నాయకులు సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల వలె వస్తున్నారని ఇలాంటివారిని తెలంగాణ ప్రజలు నమ్మరని, తెలంగాణ గొంతుక కేసీఆర్ ను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సహకారంతో చిట్యాల పట్టణంలో 39 కోట్లతో అభివృద్ధి పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పూర్తి చేసుకున్నామని అన్నారు . ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.