2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ – ములుగు
కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవి చందర్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సీతక్క మాట్లాడారు. రాజీవ్‌ గాంధీ అన్‌లైన్‌ క్విజ్‌ కాంపిటీషన్‌లో పాల్గొనే యువత 7661899899కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని, రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ జూన్‌ 1 అన్నారు. ములుగు నియోజక వర్గ కోడ్‌ 1129 జూన్‌ 2న క్విజ్‌ కాంపిటీషన్‌లో పాల్గొని 40 బహుమతులు పొందాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ లో ప్రియాంక గాంధీ సంచలనాత్మక యూత్‌ డిక్లరేషన్‌ స్ఫూర్తిగా తీసుకుని నిరుద్యోగ యువకులను మెలుకొల్పే దిశగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నడుంబిగించాలన్నారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా బాధలు తీరుతాయని నమ్మిన యువతను కెసిఆర్‌ నట్టేట ముంచారని అన్నారు. కెసిఆర్‌ పాలనలో యువకులు ఉద్యోగాలు రాక ఉపాధి లేక తల్లి తండ్రులకు భారం అయి ఆత్మ హత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంద న్నారు. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ అమలు చేస్తాం అని అన్నారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్‌ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పన,విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన చేపడతామన్నారు. ప్రత్యేక గల్ఫ్‌ విభాగం ఏర్పాటుతో గల్ఫ్‌ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్‌ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనకు కృషి చేస్తామాన్నరు. పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్‌, ఖమ్మం, మెదక్‌ లో నూతన ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీల ఏర్పాటు, బాసరలోని రాజీవ్‌ గాంధీ తరహాలో 4 నూతన ఐఐటి లను ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిం చడం జరుగుతుందన్నారు. అమెరికాలోని ఐఎంజి అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం,పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్‌, హైదరాబాద్‌ లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. యువ మహిళా సాధికారతే మా లక్ష్యం అన్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు నియోజక వర్గ కో ఆర్డినేటర్‌ గొల్ల పెల్లి రాజేందర్‌ గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవి చందర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్‌, కుమార్‌,యూత్‌ కాంగ్రెస్‌ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్‌ రెడ్డి,ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి శంకరయ్య,కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రచార కార్యదర్శి నూనెటీ శ్యామ్‌,యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్‌ యాదవ్‌,ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షులు దేవ్‌ సింగ్‌,యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కష్ణ తో పాటు యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా,మండల,గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.