తుఫాన్‌ నష్టాన్ని అంచనావేసి పరిహారమివ్వాలి

Storm damage should be assessed and compensated– రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కురుస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌ వల్ల కలిగిన పంటనష్టాన్ని అంచనావేసి పరిహారం వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు దెబ్బతిన్నట్టు ప్రభుత్వ ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి అంతకుమించి నష్టం జరిగిందని వివరించారు. 1.5 లక్షల మంది రైతులు సుమారు రూ.3,500 కోట్లు నష్టపోయినట్టు అంచనా ఉందని పేర్కొన్నారు. గొర్రెలు, బాతులు, పశువులు చనిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ పంట సీజన్‌లోనే నష్టం జరగడం ఇది రెండోసారి అని తెలిపారు. అధిక వర్షాల వల్ల జూలైలో 12 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందనీ, 49 మంది మరణించారని గుర్తు చేశారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామంటూ గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎవరికీ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ పంట కోతకొచ్చిన తరుణంలోనే మరోసారి నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరిపంటలో కేవలం 42 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయని వివరించారు. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం కూడా సౌకర్యాల్లేక తడిచిపోయిందని తెలిపారు. ఆరబెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, ములుగు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో నష్టం తీవ్రంగా ఉందని వివరించారు. ఈ నష్టాన్ని రైతులు భరించే స్థితిలో లేరని గుర్తు చేశారు. 2023-24లో 15వ ఆర్థికసంఘం కేటాయించిన రూ.660 కోట్లకు తోడు, మరికొన్ని నిధులు కేటాయించి, జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.