ఆర్మీ ఆదుపులో ముగ్గురు మృతి

–  హత్యకేసు నమోదు చేసిన జమ్ముకాశ్మీర్‌ పోలీసులు
శ్రీనగర్‌ : ఆర్మీ ఆదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై జమ్ముకాశ్మీర్‌ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. పూంచ్‌ జిల్లాలోని సూరంకోట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 302 కింద గుర్తుతెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసినట్టు అధికారులు సోమవారం తెలిపారు. పూంచ్‌ జిల్లాలో ఈ నెల 21న ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు మరణించిన ఘటన జరిగిన తరువాత రోజు సమీప గ్రామం నుంచి విచారణ కోసం ఎనిమిది మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరంతా గుజ్జార్‌ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిలో ముగ్గురు తీవ్రగాయాలతో శుక్రవారం మరణించగా, మిగిలిన ఐదుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.