ముగ్గురు సభ్యులతో అడ్‌హక్‌ కమిటీ

Ad hoc committee with three members– చైర్మన్‌గా భూపీందర్‌ సింగ్‌ బజ్వా
– తాత్కాలిక రెజ్లింగ్‌ కమిటీ నియమించిన భారత ఒలింపిక్‌ సమాఖ్య
న్యూఢిల్లీ : తాత్కాలిక రెజ్లింగ్‌ బాడీ (అడహక్‌ కమిటీ)ని భారత ఒలింపిక్‌ సమాఖ్య (ఐఓసీ) బుధవారం ప్రకటించింది. రెజ్లర్ల ఆందోళనలకు తలొగ్గిన కేంద్రప్రభుత్వం డబ్ల్యూఎఫ్‌ఐ నూతన ప్యానెల్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే డబ్ల్యూఎఫ్‌ఐ నిర్వహణ వ్యవహారాల కోసం ఒక కమిటీని నియమించాలని కూడా ఐఓసీని కోరింది. దీంతో భూపీందర్‌ సింగ్‌ బజ్వా నేతృత్వంలో తాత్కాలిక కమిటీ (అడహక్‌ కమిటీ)ని ఐఓసీ నియమిం చింది.ఎంఎం. సౌమ్య, మంజూష కన్వర్‌లు ఈ అడహక్‌ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారని ప్రకటించింది. డబ్ల్యూఎఫ్‌ఐలో న్యాయమైన, జవాబుదారీతనం, పారదర్శకత్వాన్ని నిర్థారించడాని కి ఈ అడహక్‌ కమిటీని నియమించినట్టు ఐఓఏ తెలిపింది. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజరు సింగ్‌ డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలపై రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లింగ్‌కు సాక్షి మాలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా, మరో రెజ్లర్‌ బజరంగ్‌పూనియా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ నివాసం నుండే డబ్ల్యుఎఫ్‌ఐ కార్యాలయం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు వినేష్‌ ఫోగట్‌ ప్రకటించారు.