ఐకానిక్‌ డిజైన్‌ ఎంపిక చేయాలి

ఐకానిక్‌ డిజైన్‌ ఎంపిక చేయాలి– మూసీ నదీ పరివాహక అభివృద్ధికి కృషి
–  తొలిదశలో 55 కిలోమీటర్ల అభివృద్ధి : హెచ్‌ఎండీఏ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్‌ డిజైన్‌ ఎంపిక చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై మంగళవారం నానక్‌రామ్‌ గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్‌ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఎమ్యూస్‌ మెంట్‌ పార్క్‌, వాటర్‌ ఫాల్స్‌, చిల్డ్రన్‌ వాటర్‌ స్పోర్ట్స్‌, స్ట్రీట్‌ వెండర్స్‌, బిజినెస్‌ ఏరియా, షాపింగ్‌ మాల్స్‌ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్‌ ఉండాలన్నారు. ఇందుకోసం విదేశాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్ట్‌ల డిజైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.మూడు నెలల్లోగా సంబంధిత పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆకస్మిక వరదలు వచ్చినా తట్టుకునే విధంగా నీటిని మూసీలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మూసీ నది పరీవాహక అభివృద్ధికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలు చార్మినార్‌, తారామతి బరాదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్‌ డిజైన్‌ రూపొందిచాలన్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, హెచ్‌ఎండీఏ జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమీషనర్‌ ఆమ్రపాలి, సీఎం ఓఎస్డీ అజిత్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.