విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర బృందం న్యూజిలాండ్లో లాంగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను మేకర్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించి సర్ప్రైజ్ చేసిన మేకర్స్ శుక్రవారం మంచు వారి నుంచి మూడో తరం కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిపారు. మోహన్ బాబు వారసుడిగా విష్ణు రాగా, విష్ణు వారసత్వంగా అవ్రామ్ మంచు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినీ రంగ ప్రవేశాన్ని అద్భుతమైన దశ్యకావ్యమైన ‘కన్నప్ప’తో విష్ణు మొదలుపెట్టారు. తన కొడుకు సినీ ఎంట్రీ పై విష్ణు స్పందిస్తూ, ‘ఈ ‘కన్నప్ప’ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం. ‘కన్నప్ప’ ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని అన్నారు.