నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించినట్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి కమిటీ తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. వాటితో పాటు కల్లుగీత కార్మికులకు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది కాళ్లు చేతులు విరగడం, నడుము పడిపోవటంతో పాటు ఎంతో మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. ఏడాదికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి జారి పడుతున్నారనీ, వీరిలో 180 మంది చనిపోతున్నారని తెలిపారు. సరాసరి రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్దసంఖ్యలో మరేవృత్తిలోనూ ప్రమాదాలు జరగటం లేదని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగి భూములకు విపరీతంగా ధరలు పెరగటంతో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని పేర్కొన్నారు. రోజు రోజుకు వనాలు తరిగిపోతున్నాయని పేర్కొన్నారు. లిక్కర్, బెల్టు షాపుల వల్ల కల్లు అమ్మకాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ఏరియాలో సొసైటీలు రద్దు కావడంతో అక్కడి గీత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అంశాలు..
ష్పత్తిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. సేఫ్టి మోకులు ఇవ్వాలి.
ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పన ఎక్స్రేషియాను నెల లోపు ఇవ్వాలి. మెడికల్ బోర్డు విదానం తొలగించాలి. వృత్తిలో ఎక్కడ ప్రమాదం జరిగినా వర్తింప జేయాలి.
బెల్టు షాపులను పూర్తిగా నిషేదించాలి. కల్లులోని పోషకాలను, ఔషద గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి.
గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా రూ.4వేలు ఇవ్వాలి.
కల్లుగీత కార్మికులందరికి వృత్తికి ఉపయోగ పడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి.
ఎజెన్సి ఏరియాలో కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించి సంక్షేమ పధకాలు అక్కడి గీత కార్మికులకు వర్తింప చేయాలి.
రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించి టాడి కార్పొరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించాలి.
ప్రతి సొసైటీకి చెట్ల పెంచడానికి 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్న 560 జివో అమలు చేయాలి. లేదా కొనివ్వాలి.
టీడీపీి ప్రభుత్వం హయాంలో ఇచ్చిన 439 సొసైటీల భూములకు పెన్సింగ్ చేయించాలి. తాటి, ఈత, జీనుగు, ఖర్జూర తదితర కల్లునిచ్చే పొట్టి చెట్లు నాటాలి.
కల్లుగీత కార్పోరేషన్ నుండి వృత్తిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలి. దహన సంస్కారాల కొరకు రూ 50వేలు, గాయాలైన వారికి వైద్య ఖర్చుల కొరకు రూ.25వేలు ఇవ్వాలి.
నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో నెలకొల్పాలి. గౌడ యువతీ యువకులకు ఉపాది కల్పించాలి.
తాటి, ఈత చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విదంగా కొత్త చట్టం తీసుకరావాలి.
వేతన గీత కార్మికులకు అసోషియేట్ మెంబర్షిప్ ఇవ్వాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పధకాలు వర్తించ చేయాలి.
ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలి.
మెమో నెం. 3347 /డి/2023 ప్రకారం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి.
కాగ్రేస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విదంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వెంకట నరసయ్య, గౌనీ వెంకన్న, పామన గుండ్ల అచ్చాలు, బాల్న వెంకట మల్లయ్య, సంఘం రాష్ట్ర కార్యదర్శులు చౌగాని సీతారాములు, బూడిద గోపి, ఎస్ రమేష్ గౌడ్, బండ కింది అరుణ్, మడ్డి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.