– దావోస్లో అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో భేటీ
– కీలక రంగాల్లో పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం: మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రానికి భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటనకు సంబందించిన వివరాలను ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనాల్సిందిగా రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆహ్వానం అందిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి సీఎం నేతృత్వం వహించడం ఇది తొలిసారని పేర్కొన్నారు. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కూడా ఉంటారని తెలిపారు. విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకుని కొత్త ప్రభుత్వ విజన్, ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అని పేర్కొన్నారు. మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను, సీఎం కలిసి 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నామని వెల్లడించారు. తాము సమావేశం కాబోతున్న వారిలో నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, సీఎక్స్ఓలు ఉన్నారని తెలిపారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వడమే కాకుండా సీఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో సమావేశం అవుతామని వివరించారు. దావోస్ పర్యటన విజయవంతం కావటానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదనీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందనీ, ఆయనను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మాట్లాడవలసిందిగా ఆహ్వానించారని వెల్లడించారు. అక్కడ జరగబోయే చర్చాగోష్టిలో పురోగమిస్తున్న వైద్యరంగంపై అభిప్రాయాలను పంచుకుంటారని తెలిపారు.
”ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్” అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని ఆగ్రి – ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఏఐ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ”డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ” అనే అంశంపై తాను మాట్లాడటమే కాకుండా టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాసీ భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా కలుసుకుంటానని చెప్పారు. ఈ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తో సమావేశం అవుతామని ప్రకటించారు. రాష్ట్రంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి బలమైన వ్యవస్థీకృత సంబంధాలున్నాయనీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సెంటర్ ఫర్ 4త్ ఇండిస్టీయల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్) సదస్సు హైదరాబాదులో జరగబోతున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయం ఆహార శుద్ధి రంగాల్లో సాంకేతిక ఉపక్రమణలకు ఆ సంస్థ క్రియాశీలకంగా మద్దతిస్తోందని పేర్కొన్నారు.