– గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ప్రత్యేక సెట్టింగ్స్
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లి లోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో బోగి పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలతోపాటు గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా, పూర్తిగా పల్లె వాతావరణం ఉండేలా ప్రత్యేక సెట్టింగ్లు వేశారు. వందేండ్ల క్రితం తిరుమల ఉన్న తరహాలో సెట్టింగ్లు కూడా వేశారు. బోగి పండుగ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో పాల్గొనగా, వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా గంగిరెద్దులకు సారె సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులతో సంక్రాంతి నృత్యాలతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, డిప్యూటీ సిఎమ్లు కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ నందిగామ సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.