గవర్నర్‌ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎక్స్‌(ట్విటర్‌) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం గవర్నర్‌ ఎక్స్‌ అకౌంట్‌లో సంబంధం లేని పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని తక్షణమే సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దృష్టికి రాజ్‌భవన్‌ అధికారులు తీసుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ కవిత సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్‌స్ట్రాగ్రామ్‌, ఎక్స్‌ ఖతాలు హ్యాక్‌ అయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరసగా పలు సార్లు వాటిని హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించారని కవిత పేర్కొన్నారు. దుండగులు అనుమానాస్పదంగా లాగిన్‌ అయ్యి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారని తెలిపారు. విషయాన్ని గుర్తించిన ఆమె డీజీపీకి, సైబర్‌ సెక్యూరిటీ విభాగానికి వాటిని ట్యాగ్‌ చేస్తూ ఫిర్యాదు చేశారు.